- వయాకామ్ 18లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న రిలయన్స్
- కొత్త మీడియా కంపెనీని ఏర్పాటు చేసిన అదానీ ఎంటర్ ప్రైజెస్
- ఐపీఎల్ మీడియా రైట్స్ కోసమే అంటున్న ఎనలిస్టులు
- డిస్నీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం
బిజినెస్ డెస్క్, వెలుగు:ఆసియాలోనే అత్యంత ధనవంతులయిన గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీలు ఈ సారి మీడియా సెక్టార్లో పోటీ పడడానికి రెడీ అయ్యారు. అంతేకాకుండా ఫారిన్ కంపెనీలయిన నెట్ఫ్లిక్స్, అమెజాన్కు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు. దేశ మీడియా సెక్టార్లో ముకేశ్ అంబానీకి ఇప్పటికే బిజినెస్లు ఉన్నాయి. పారామౌంట్ గ్లోబల్తో కలిసి వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ను అంబానీ నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వయాకామ్ 18 లో రూ. 13,500 కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి జేమ్స్ ముర్డోక్ నేతృత్వంలోని బోధి ట్రీ సిస్టమ్స్ ముందుకొచ్చింది. ఇంకోవైపు గౌతమ్ అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ కింద మీడియా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ, అదానీ గ్రూప్ ఇప్పటికే క్లింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో వాటా కొనేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ కంపెనీ క్వింట్ డిజిటల్ మీడియాకు సబ్సిడరీ. బ్లూమ్బర్గ్తో కలిసి ఇండియాలో డిజిటల్ మీడియా సర్వీస్లను క్వింటిలియన్ బిజినెస్ మీడియా అందిస్తోంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీడియా సెగ్మెంట్లో విస్తరించాలని గౌతమ్ అదానీ చూస్తున్నట్టు తెలుస్తోందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. వయాకామ్ 18 లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు రావడం, అదానీ గ్రూప్ నుంచి ఓ మీడియా కంపెనీ రావడంతో మీడియా సెగ్మెంట్లో పోటీ తీవ్రమయ్యిందని చెబుతున్నారు. అంబానీ కూడా తన నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్, టీవీ 18 బ్రాడ్కాస్ట్తో మీడియా సెగ్మెంట్లో విస్తరిస్తున్నారు.
పెద్ద మార్కెట్ అనే..
దేశంలో లోకల్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా ఎదిగింది. ఇంటర్నెట్ వాడకం పెరగడంతో పాటు, మిడిల్ క్లాస్ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతుండడంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మరింత పెరుగుతుందని అంచనావేస్తున్నారు. మనది పెద్ద మార్కెట్ అయినా, టఫ్ మార్కెట్ అని చెబుతున్నారు ఎనలిస్టులు. నెట్ఫ్లిక్స్ తన సబ్స్క్రయిబర్లను పెంచుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సబ్స్క్రయిబర్లను ఆకర్షించడానికి దేశంలో తన ప్లాన్ల రేట్లను కూడా కంపెనీ తగ్గించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. అయినప్పటికీ, చైనా తర్వాత ఎక్కువగా గ్రోత్కు అవకాశం ఉన్న అతిపెద్ద మార్కెట్ ఇండియానేనని మీడియా పార్టనర్స్ ఏసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ కౌటో అన్నారు. ఇండోనేషియాలో కూడా అవకాశాలు ఉన్నప్పటికీ, మనతో పోలిస్తే అది చిన్న మార్కెట్ అని అన్నారు.
ఐపీఎల్పైనే కళ్లు!
వయాకామ్ 18 లోకి బోధి ట్రీ నుంచి రూ. 13,500 కోట్లు పెట్టుబడులు రానుండగా, రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అదనంగా రూ. 1,645 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. కాగా, కలర్స్ టీవీ ఛానెల్స్ను, ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్ను వయాకామ్ 18 నడుపుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా జియో ఓటీటీ ప్లాట్పామ్ జియోసినిమా కూడా వయాకామ్ 18 కు ట్రాన్స్ఫర్ అవ్వనుంది. మరోవైపు ఈ కంపెనీలో పారామౌంట్ కీలక షేరుహోల్డర్గా ఉంది. ఈ కంపెనీ రానున్న ఐపీఎల్ మీడియా రైట్స్ ఆక్షన్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. డిస్నీ, అమెజాన్, సోనీ గ్రూప్ కార్పొరేషన్లు ఐపీఎల్ కోసం తీవ్రంగా ప్రయత్నించనున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఐపీఎల్ మీడియా రైట్స్ కోసమే వయాకామ్ 18 ఇన్వెస్ట్మెంట్లను సేకరిస్తోందనే వార్తలూ వస్తున్నాయి.
టీవీ18, నెట్వర్క్ 18 షేర్లు ఢమాల్!
ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో నెట్వర్క్ 18, టీవీ 18 బ్రాడ్కాస్ట్ షేర్లు గురువారం సెషన్లో 20 శాతం వరకు నష్టపోయాయి. నెట్వర్క్ 18 షేరు 20 శాతం తగ్గి రూ. 91 వద్ద క్లోజయ్యింది. టీవీ 18 బ్రాడ్కాస్ట్ షేరు 17 శాతం తగ్గి రూ.62.40 దగ్గర ముగిసింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.4 శాతం పెరిగి రూ. 2,810 దగ్గర క్లోజయ్యింది. కంపెనీ షేరు ఇంట్రాడేలో రూ. 2,851 దగ్గర ఆల్ టైమ్ హైని రికార్డ్ చేసింది.