
ముంబై: అదానీ గ్రూప్లోని ఎన్బీఎఫ్సీ కంపెనీ అదానీ క్యాపిటల్ రూ. 1,500 కోట్లను స్ట్రేటజిక్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఎంఎస్ఎంఈ గ్రోత్, రూరల్ డెవలప్మెంట్ పై ఈ కంపెనీ ఫోకస్ పెడుతోంది. కొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అదానీ క్యాపిటల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తితో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవెండస్ క్యాపిటల్ను ఈ డీల్ కోసం అదానీ క్యాపిటల్ నియమించుకున్నట్లు పేర్కొన్నాయి.
కంపెనీలోని 90 శాతం ఈక్విటీ అదానీ గ్రూప్ చేతిలో ఉండగా, మిగిలిన 10 శాతం మేనేజ్మెంట్ టీమ్ చేతిలో ఉంది. రాబోయే రెండు, మూడేళ్లలో ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) సైజును రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్లకు పెంచుకోవాలనేది అదానీ క్యాపిటల్ ఆలోచనగా వివరించాయి. మార్చి 2023 నాటికి ఈ కంపెనీ ఏయూఎం రూ. 3,977 కోట్లు. అదానీ క్యాపిటల్ నుంచి అదానీ గ్రూప్ వైదొలగనుందనేవి రూమర్లేనని అదానీ గ్రూప్ స్పోక్స్పర్సన్ స్పష్టం చేశారు.