- దేశ క్రూడాయిల్, గ్యాస్ దిగుమతులు తగ్గించడమే లక్ష్యం
- ఇండియా గ్రోత్తోనే మా గ్రోత్ ముడిపడి ఉంది: గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ : దేశంలో పెట్టుబడులు పెట్టడం ఎప్పటికీ ఆగదని అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఇండియా వృద్ధితోనే తమ వృద్ధి ముడిపడి ఉందని అన్నారు. క్లీన్ ఎనర్జీ బిజినెస్లలో 70 బిలియన్ డాలర్లు (రూ.5.6 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామని, ఈ పెట్టుబడులతో క్రూడాయిల్, గ్యాస్ దిగుమతులపై ఇండియా ఆధారపడడం తగ్గుతుందని యాన్యువల్ షేరు హోల్డర్ మీటింగ్లో గౌతమ్ అదానీ వివరించారు. ఏదో ఒకరోజు క్లీన్ ఎనర్జీ (సోలార్, విండ్ కరెంట్ వంటివి) ఎక్స్పోర్టర్గా మారుతామని పేర్కొన్నారు. ‘దేశంలో ఇన్వెస్ట్ చేయడం నుంచి ఎప్పుడూ వెనుదిరగలేదు. ఎప్పుడూ స్లో అవ్వలేదు’ అని గౌతమ్ అదానీ చెప్పారు. తమ భిన్నమైన వ్యాపారాలు, పనితీరు, బిజినెస్ల సైజు.. ఎటువంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా తాము బలంగా ఉండడానికి సాయపడతాయని అన్నారు.
రూ. 16 లక్షల కోట్లకు అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్
అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ కరెంట్ ప్రొడ్యూసర్గా ఎదిగింది. ఈ కంపెనీ కెపాసిటీని 2030 నాటికి 45 గిగావాట్లకు పెంచాలని అదానీ గ్రూప్ టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏడాదికి 2 గిగావాట్ల సోలార్ పవర్ను ప్రొడ్యూస్ చేయడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని అదానీ గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. కాగా, ప్రభుత్వం నుంచి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లను దక్కించుకున్న అదానీ గ్రూప్, దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో కీలకంగా మారింది. హోల్సిమ్ గ్రూప్ కంపెనీలయిన ఏసీసీ, అంబుజా సిమెంట్లను కొనుగోలు చేసి దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీగా మారింది. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా ఉన్న అదానీ గ్రూప్, పోర్టుల బిజినెస్లో కీలకంగా ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో అదానీ గ్రీన్ ఎనర్జీ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. అదానీ విల్మార్తో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో కూడా విస్తరిస్తోంది. వీటికి అదనంగా డేటా సెంటర్లు, డిజిటల్ సూపర్ యాప్స్, ఇండస్ట్రియల్ క్లౌడ్స్, డిఫెన్స్, ఎరోస్పేస్, మెటల్స్, మెటీరియల్స్ సెక్టార్లలో కూడా ఎంటర్ అయ్యామని గౌతమ్ అదానీ అన్నారు. అదానీ గ్రూప్ నుంచి మొత్తం 6 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కాగా, వీటి మొత్తం మార్కెట్ క్యాప్ వాల్యూ 200 బిలియన్ డాలర్ల (రూ. 16 లక్షల కోట్ల) ను క్రాస్ చేసింది.
బొగ్గు దిగుమతుల్లో అదానీ టాప్
ఎన్టీపీసీ ప్లాంట్ల కోసం 1.73 కోట్ల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకొని, ట్రాన్స్ఫర్ చేయడానికి అదానీ గ్రూప్ టెండర్లు గెలుచుకుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. బొగ్గు కొరత ఏర్పడడంతో ఈ ఏడాది సమ్మర్లో పవర్ షార్టేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడం పెంచుకోవాలని ప్రభుత్వ కంపెనీలను గవర్నమెంట్ ఆదేశించింది. ఇందులో భాగంగానే కోల్ ఇండియాతో పాటు ఎన్టీపీసీ పిలిచిన బొగ్గు దిగుమతుల టెండర్లను కూడా అదానీ గ్రూప్ దక్కించుకుంది. కాగా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను 2 కోట్ల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని చూస్తున్న ఎన్టీపీసీ, ఇందులో 1.73 కోట్ల టన్నుల బొగ్గును సరఫరా చేసే అవకాశాన్ని అదానీ ఎంటర్ప్రైస్కు కలిపించింది. ఈ ఏడాది ఇప్పటికే 70 లక్షల టన్నుల బొగ్గును ఎన్టీపీసీ ప్లాంట్లకు అదానీ గ్రూప్ సరఫరా చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ అంశంపై ఎన్టీపీసీ, అదానీ గ్రూప్ స్పందించలేదు. కరోనా తర్వాత ఇండస్ట్రీలలో ప్రొడక్షన్ పెరగడంతో కరెంట్ డిమాండ్ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు హీట్ వేవ్స్ తోడవ్వడంతో ఈ ఏడాది సమ్మర్లో కరెంట్ డిమాండ్ పెరిగింది. డిమాండ్ తగ్గ బొగ్గును కోల్ ఇండియా సప్లయ్ చేయలేకపోవడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో పవర్ షార్టేజ్లు చూశాం. ఈ టైమ్లోనే విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకు కోల్ ఇండియా, ఎన్టీపీసీలు ఇంపోర్ట్ టెండర్లను పిలిచాయి. ఆస్ట్రేలియా క్లీన్స్ల్యాండ్లోని కార్మైకెల్ కోల్ మైన్స్ నుంచి తమ మొదటి బ్యాచ్ను కిందటేడాది డిసెంబర్లో అదానీ గ్రూప్ ఇండియాకు సరఫరా చేసింది.