
- భర్తే చంపేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ .. హైవేపై ఆందోళన
నేరడిగొండ, వెలుగు: అనుమానాస్పదంగా మహిళ చనిపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిదిపల్లికి చెందిన సుజాత(21)కు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మం డలం దర్భ తండాకు చెందిన ఆడే నటరాజ్ తో పెండ్లి అయింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. దంపతులు నేరడిగొండ మండల కేంద్రంలో నివసిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది.
దీంతో సుజాత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సమాచారం తెలియడంతో మృతురాలి కుటుంబీకులు గురువారం ఉదయం వెళ్లారు. తమ కూతురిని భర్త నటరాజ్ గొంతు నులిమి చంపేసి, ఆత్మహత్యగా మార్చారని ఆరోపిస్తూ హైవేపై ఆందోళనకు దిగారు. ఆపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులపై దాడికి దిగారు. ఏఎస్పీ కాజల్ సింగ్ వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.