
ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురంలో హైకోర్టు అడ్వకేట్ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ కేసులో వెంటనే స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే కిడ్నాపర్లను ట్రెస్ చేసి బాధితుడిని కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ చింతలకుంటలోని సరస్వతి నగర్ కాలనీకి చెందిన అడ్వకేట్ పాలడుగు నారాయణ శనివారం (జూన్ 7) అర్ధరాత్రి తన ఇంటి పార్కింగ్ స్థలంలో ఉన్నాడు.
ఈ సమయంలో ఓ కారులో అక్కడికి వచ్చిన ముగ్గురు దుండగులు నారాయణను కిడ్నాప్ చేశారు. అనంతరం ఏపీలోని ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ ఓ స్తంభానికి కట్టేసి బాధితుడి భార్య స్వర్ణమ్మకు ఫోన్ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. దీంతో ఆమె అదే రోజు వనస్థలిపురం పీఎస్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు ప్రకాశం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు.
అక్కడికి చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఆదివారం రాత్రి వనస్థలిపురం తీసుకొచ్చారు.హెల్త్ చెకఫ్ తర్వాత రిమాండ్కు తరలించారు. కిడ్నాపర్లలో ఒకరైన వెంకటేశ్ అనే వ్యక్తి వద్ద నారాయణ రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో నారాయణను కిడ్నాప్ చేసి ఆ డబ్బులు వసూలు చేసుకోవాలని, మరో ముగ్గురితో కలిసి వెంకటేశ్ కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, ఓ భూమి విషయంలో వెంకటేశ్ కు తమకు మధ్య గొడవ జరుగుతుందని మీడియాతో నారాయణ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వెంకటేశ్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, వారి
వివరాలు తెలపలేదు.