100 కోట్ల డీల్ అని డబ్బులు చూపెట్టలేదు : రచనా రెడ్డి

100 కోట్ల డీల్ అని డబ్బులు చూపెట్టలేదు : రచనా రెడ్డి

డబ్బులు చూపించకుండానే పీసీ యాక్ట్ కింద కేసు ఎలా నమోదు చేస్తారని అడ్వకేట్ రచనా రెడ్డి ప్రశ్నించారు. ఫాంహౌస్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై ఆమె స్పందించారు. పీసీ యాక్ట్ కింద ఏసీబీ మాత్రమే విచారణ చెయ్యాలని.. సిట్కు ఆ అధికారం ఉండదన్నారు. 100 కోట్ల డీల్ అని.. ఇంతవరకు డబ్బులు చూపెట్టలేదని చెప్పారు. అసలు డబ్బులు ఎక్కడున్నాయో ఇంతవరకు తేలలేదన్నారు. ఇన్విస్టిగేషన్ పెండింగ్ ఉన్నప్పుడు దానిపై మాట్లాడకూడదని.. కానీ సీఎం కేసీఆర్ మాట్లాడరని రచనారెడ్డి ఆరోపించారు. 

సీబీఐ ఎంట్రీపై

సీబీఐకి రాష్ట్రానికి అనుమతిలేదన్న ప్రభుత్వ జీవోపై ఆమె స్పందించారు. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు ఆదేశాలుంటే జీవోలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలతో సీబీఐ నేరుగా వెళ్లి విచారణ  జరపవచ్చని తెలిపారు.

సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఫాం హౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని  సీబీఐకు ఇవ్వాలని చెప్పింది.