
Aegis Vopak Terminal IPO: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోలు అధిక సంఖ్యలో వస్తున్నప్పటికీ గతంలో మాదిరిగా పెద్ద లాభాలను మాత్రం తెచ్చిపెట్టడంలో అవి విఫలం అవుతున్నాయి. దీంతో ఒకపక్క ఈక్విటీ మార్కెట్లలో నష్టాలతో పాటు మరోపక్క ఐపీవోలు కూడా హ్యాండ్ ఇచ్చేయటంతో ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నారు. నేడు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు ఐపీవోలు సైతం నష్టాల జాబితాతో నిరాశను ఇన్వెస్టర్లకు మిగిల్చాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏజిస్ వోపాక్ టెర్మినల్స్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 6.38 శాతం డిస్కౌంట్ రేటు రూ.220 వద్ద నేడు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. వాస్తవానికి కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2వేల 800 కోట్లు సమీకరించే లక్ష్యంతో వచ్చింది. ఇందుకోసం ఐపీవోను మే 26 నుంచి 28 వరకు ఓపెన్ లో ఉంచిన సంస్థ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.223 నుంచి 235గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన ఐపీవో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.వెయ్యి 260 కోట్లను సమీకరించింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తంలో రూ.2వేల 016 కోట్లను రుణ చెల్లింపుల కోసం వినియోగిస్తుండగా.. రూ.671 కోట్ల 30 లక్షలను క్యాపెక్స్ అవసరాలకు ఉపయోగించనుంది. ఈ సొమ్ముతో మంగళూరులోని క్రయోజనిక్ ఎల్పీజీ టర్మినల్ విస్తరించాలని నిర్ణయించింది. మరికొంత మెుత్తాన్ని జనరల్ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనుంది.
కంపెనీ వ్యాపారం..
కంపెనీ తన వ్యాపారాన్ని 2013లో ప్రారంభించింది. కంపెనీ ఎల్పీజీ స్టోరేజ్ టెర్మినల్స్ నిర్వహణ, యాజమాన్యాన్ని కలిగి ఉంది. దీనికి తోడు పెట్రోలియం, వంటనూనెలు, లూబ్రికెంట్లు, కెమికల్స్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి గ్యాసులను సురక్షితంగా స్టోర్ చేసేందుకు అవసరమైన ఇన్ ఫ్రా సేవలను అందిస్తుంటుంది.
కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ ఆనంద్ రాఠీ వెల్త్ సానుకూలంగా ఉంది. దీర్ఘకాలిక వ్యూహంతో కంపెనీ తన వ్యాపార విస్తరణను చేపడుతోందని, అలాగే కంపెనీ వ్యాపారం కూడా మార్కెట్లో బాగుందని పేర్కొంది.