టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అయితే 'వారణాసి' మూవీ పూర్తికాకముందే మహేష్ బాబు తదుపరి ప్రాజెక్టులపై ఫిల్మిం నగర్ సర్కీల్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
సందీప్ వంగా ' డెవిల్ '
మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏషియన్ సినిమాస్, హోంబలే ఫిల్మ్ వంటి బడా నిర్మాణ సంస్థలు మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నరే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో సందీప్, మహేష్ బాబుకు 'డెవిల్' అనే పవర్ ఫుల్ స్క్రిప్ట్ను వినిపించినట్లు వార్తలు వచ్చాయి. 'యానిమల్' సినిమా కంటే అత్యంత క్రూరంగా, వయలెంట్గా ఈ 'డెవిల్' పాత్ర ఉంటుందని దర్శకుడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ తెరపైకి వస్తుందన్న వార్తలతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?
టాలీవుడ్లో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా వెంటనే హిట్ రాదు. దీనిని రాజమౌళి శాపం అని సరదాగా పిలుస్తుంటారు. అయితే, మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా లాంటి మాస్ డైరెక్టర్తో చేస్తే, ఆ సెంటిమెంట్కు ఈజీగా బ్రేక్ పడుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ తన పూర్తి ఫోకస్ అంతా రాజమౌళి ప్రాజెక్ట్పైనే పెట్టారు. సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్తో 'స్పిరిట్' , అల్లు అర్జున్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాబట్టి, ఈ కాంబినేషన్ కుదిరితే అది 2027 తర్వాతే పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి 'వారణాసి' టార్గెట్
ప్రస్తుతం 'వారణాసి' మూవీ షూటింగ్ 50 శాతం పూర్తయినట్లు సమాచారం. రాజమౌళి ఈ చిత్రంలో మహేష్ బాబును 'రుద్ర' అనే సాహసికుడిగా చూపిస్తుండగా, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా మందాకినీగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ 'వారణాసి' మూవీతో దాదాపు రూ 3 వేల కోట్లు రాబట్టేలా టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
