తెలంగాణలో రేపటినుంచి విద్యాసంస్థలు మూసివేత

తెలంగాణలో రేపటినుంచి విద్యాసంస్థలు మూసివేత

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా స్కూళ్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. విద్యార్థులకు, టీచర్లకు కరోనా సోకి.. వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. విద్యార్థుల తల్లితండ్రులు స్కూల్స్ మూసివేయాలని కోరుతున్నారు. దాంతో రాష్ట్రంలోని స్కూళ్ళు, గురుకులాలు, హాస్టళ్లు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రేపటి నుంచి స్కూళ్లన్నీ బంద్ చేస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వైద్య కళాశాలలు కాకుండా రాష్ట్రంలోని హాస్టళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మూసివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

మంత్రి సబిత విడుదల చేసిన ప్రెస్ నోట్ యధావిధిగా మీకోసం.. ‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందున్నది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నది. మన రాష్ట్రంలోని విద్యా సంస్థల్లోనూ చెదురుముదురుగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి గనుక, కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారినుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటినుండి (24.3.2021) తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి, రాష్ర్టంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. 
రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’.