తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా ఇప్పటికీ మళ్లీ ఉద్యోగులుగా గుర్తించడం లేదని సిటీలో గతంలో పని చేసిన హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలోని హోంగార్డులు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఆందోళనకు దిగారు.
2011లో ఆర్డర్ కాపీలు లేవంటూ 250 మంది హోంగార్డులను విధుల నుండి తొలిగించారు. పదేళ్లు తమతో పని చేయించుకొని , అన్యాయంగా తమను తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమను విధుల్లోకి తీసుకుంటామని హామీనిచ్చిన విషయం గుర్తు చేశారు.
ఐదేళ్లు గడుస్తున్నా తమను విధుల్లోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగం వస్తుందని 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని.. అవి రాక కొందరు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ తమ ఉద్యోగాలపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించి న్యాయం చేయాలని కోరారు.