- నిర్వహణపై ఐఐఎంఆర్లో వర్క్షాప్
- సరఫరా కోసం అక్షయపాత్రతో ఎంవోయూ
- ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్కు ష్యూరిటీ లేకుండా బ్యాంకు ద్వారా లోన్లు.
హైదరాబాద్, వెలుగు: మహిళలను మిల్లెట్ బిజినెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్ యాక్షన్ప్లాన్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వారి భాగస్వామ్యంతో మిల్లెట్ ఔట్లెట్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మార్కెట్లో డిమాండ్ గల మిల్లెట్ ఉత్పత్తుల వ్యాపారంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించింది. ఫస్ట్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఒకటి రెండు చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పది ఔట్లెట్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా హరేకృష్ణ మిషన్ కు చెందిన అక్షయపాత్ర సంస్థతో ఒప్పందం చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మిల్లెట్స్, వాటితో ప్రాసెస్ చేసిన ప్రాడక్ట్స్ సేల్ చేసేందుకు ఈ ఔట్లెట్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ను ఎంపిక చేసి వారికి వీటిని కేటాయించాలని, వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్(ఐఐఎంఆర్)లో గురువారం ఆగ్రోస్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించింది. మిల్లెట్ బిబిజెస్ పై అవగాహన, కావాల్సిన పెట్టుబడులు, అందుకు అవసరమైన లోన్లు, సరుకుల సరఫరా వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, అక్షయపాత్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
హెచ్డీఎఫ్సీతో ఆగ్రోస్ ఒప్పందం
మిల్లెట్ ఔట్లెట్స్కు ఏర్పాటుకు ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్కు లోన్లు ఇప్పించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో ఆగ్రోస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఔట్లెట్ పెట్టడానికి ఆసక్తి ఉన్న మహిళలకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా లోన్లు ఇప్పించనుంది. పలు రకాల ప్రభుత్వ పథకాల ఆధారంగా కూడా వీరికి లోన్లు అందించేందుకు కృషి చేస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు.
68 రకాల మిల్లెట్ ప్రొడక్టులు
మిల్లెట్ ఔట్లెట్లకు అక్షయపాత్ర ఫౌండేషన్ అవసరమైన మిల్లెట్లు, వాటి ఉత్పత్తులను సరఫరా చేయనుంది. ఇప్పటికే టీఎస్ ఆగ్రోస్, అక్షయ పాత్ర మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అక్షయపాత్ర ఫౌండేషన్ 68 రకాల మిల్లెట్ ఉత్పత్తులను ఔట్లెట్కు సరఫరా చేయనుంది. మిల్లెట్స్తో నూడుల్స్, బిస్కెట్స్, చపాతి, ఇడ్లీ, దోశ వంటి రెడీటూ కుక్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
