ఏఐ మ్యాజిక్: రాత్రికి రాత్రే రూ.40 లక్షల లాభం తెచ్చిపెట్టింది.. ఎలాగో తెలుసా?

ఏఐ మ్యాజిక్: రాత్రికి రాత్రే రూ.40 లక్షల లాభం తెచ్చిపెట్టింది.. ఎలాగో తెలుసా?

అమెరికా నిద్రపోతున్న వేళ.. ఏఐ మేల్కొని కాసుల వర్షం కురిపించింది.  కేవలం ఒక్క రాత్రిలోనే ఏకంగా రూ.40 లక్షలకు పైగా లాభాన్ని ఆర్జించి ట్రేడింగ్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. ఎక్స్ యూజర్ '0x_Discover' దీనికి సంబంధించి వివరాలను పంచుకోవటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తక్కువ సమయంలోనే ఏఐ అద్భుతాలు చేయగలదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ఈ అద్భుతానికి కారణం 'ఓపెన్ క్లా' అనే ఏఐ ట్రేడింగ్ ఏజెంట్. ఇది కేవలం 9 రోజులుగా పని చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ టైం జోన్స్ లో ఉండే సమాచార వ్యత్యాసాలను పసిగట్టేలా డిజైన్ చేయబడింది. అమెరికాలోని ట్రేడర్లు గాఢ నిద్రలో ఉన్న సమయం అంటే తెల్లవారుజామున 2 నుంచి 6 గంటల మధ్య.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కీలక పరిణామాలు జరుగుతుంటాయి. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవడమే ఈ ఏఐ ఏజెంట్ అసలు వ్యూహం.

ఒక రోజు తెల్లవారుజామున 3:47 గంటల సమయంలో.. ఈ ఏఐ ఏజెంట్ తన యజమానికి ఒక అలర్ట్ పంపింది. దాదాపు రూ.11 లక్షల పెట్టుబడిని 6 రకాల ప్రిడిక్షన్ మార్కెట్లలో పెట్టడానికి అనుమతి కోరింది. యజమాని నిద్రమత్తులోనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్లీ పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి.. ఆ ఏఐ ఏజెంట్ ఏకంగా రూ.40.47 లక్షల నికర లాభాన్ని సంపాదించి పెట్టింది. 

ఈ లాభం ఎలా సాధ్యమైందంటే.. జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయం, యూరోపియన్ పార్లమెంట్ ఓటింగ్, ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందాల వంటి అంతర్జాతీయ వార్తలను ఈ ఏఐ నిశితంగా గమనించింది. జపాన్ ప్రభుత్వ ఆర్ఎస్ఎస్ ఫీడ్లు, ఆస్ట్రేలియా ఫైనాన్షియల్ వైర్లు, మిడిల్ ఈస్ట్ ఫ్లైట్ ట్రాకర్ల ద్వారా సమాచారాన్ని సేకరించింది. అమెరికా ట్రేడర్లు స్పందించకముందే.. వార్తలకు అనుగుణంగా బెట్టింగ్ వేసి భారీ లాభాలను అందుకుంది. సమాచార చేరవేతలో ఉండే ఆలస్యం  ఏఐకి ఒక అద్భుతమైన అవకాశంగా మారింది ఇక్కడ.