కాగజ్నగర్, వెలుగు: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ బీఆర్ఎస్ అనవసర ఆందోళనలు చేస్తోందని ఏఐసీసీ మహిళా జాతీయ కార్యదర్శి, ఏపీ, అండమాన్, నికోబార్ దీవులు ఇన్చార్జి బెస్త అదిత విమర్శించారు. కాగజ్నగర్ పట్టణంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సిర్పూర్ పేపర్ మిల్లు కోసం బీఆర్ఎస్ కావాలనే రాద్దాంతం చేస్తోందని, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
సిర్పూర్ పేపర్ మిల్లు సహా రాష్ట్రంలోని కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో కనీస వేతన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్మికులకు అన్ని విధాలా నష్టం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు డ్రామా రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
గతంలో సిర్పూర్లో పోటీ చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ను తీవ్రంగా విమర్శించి, ఇప్పుడు వారినే సమర్థిస్తూ రాజకీయాలు చేయడం ఆశ్చర్యకరమన్నారు.
