
గాంధీనగర్: 2025, జూన్ 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ దుర్ఘనటలో విమానంలోని 241 మంది, విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోని నలుగురు మెడికల్ విద్యార్థులు మరణించారు.
ఈ విషాద ఘటన పూర్తిగా మురవకముందే.. అదే రూట్.. అదే ఎయిర్ ఇండియా కంపెనీకి చెందిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సారి సమస్యను పైలట్ ముందుగానే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగరకముందే ఫ్లైట్ సర్వీసు రద్దు చేశారు.
షెడ్యూల్ ప్రకారం మంగళవారం (జూన్ 17) మధ్యాహ్నం 1.10 గంటలకు ఎయిర్ ఇండియా 159 విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరాల్సి ఉంది. ప్రయాణికులు అందరూ ఫ్లైట్లోకి ఎక్కి కూర్చుకున్నారు. సరిగ్గా ఫ్లైట్ టేకాఫ్కు ముందు పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించాడు.
దీంతో విమానంలోని దాదాపు 200 మంది ప్రయాణికులందరిని కిందకు దించేశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఫ్లైట్ సర్వీసును తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులందరికి టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఇటీవల ఘోర ప్రమాదానికి గురైన ఏఐ171 ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా పూర్తిగా రద్దు చేసింది. మృతులకు నివాళిగా ఏఐ 171 స్థానంలో AI 159 ఫ్లైట్ సర్వీసును ప్రారంభించింది. ఈ విమానం అహ్మదాబాద్ టూ లండన్ మధ్య నడవనుంది. ప్రమాదానికి గురైన విమానం స్థానంలో తీసుకొచ్చిన ఏఐ 159 ఫ్లైట్లోనూ సాంకేతిక లోపం తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. గత వారం జరిగిన ప్రమాదం తర్వాత అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన మొదటి ఎయిర్ ఇండియా విమానం ఇదే. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం కూడా రద్దు కావడంతో ఎయిర్ ఇండియా అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది.