న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థుల ఆందోళనను పోలీసులు క్రూరంగా అణిచివేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. నీట్ పేపర్ లీక్కు నిరసనగా బీహార్లో ఆందోళన చేపట్టిన యువతపై పోలీసులు ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతోన్న యువతపై దాడి చేసినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం విద్యార్థుల పట్ల హత్యపూరితంగా మారిందని ఆరోపించారు. నిరసనకారులపై అధికారులు మితిమీరిన బలప్రయోగం చేస్తున్నారని.. దీనిపై కేంద్రం జవాబుదారీతనం వహించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
