Telangana Tourism: ఆదరణకు నోచుకోని అక్కమహాదేవి గుహలు.. చూడాల్సినవి ఎన్నో ఉన్నా కానీ ..

Telangana Tourism: ఆదరణకు నోచుకోని అక్కమహాదేవి గుహలు.. చూడాల్సినవి ఎన్నో ఉన్నా  కానీ ..

తెలంగాణలో దశాబ్దాల నాటి గుహలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.  అలాంటి వాటిల్లో కృష్ణా తీరంలో అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఏపీ నుంచి బోట్ షికార్ ద్వారా పర్యాటలకులు  వస్తారు.   తెలంగాణలోని  చారిత్రక అక్కమహాదేవి గుహలపై ప్రత్యేక కథనం..   . .

కృష్ణాతీరంలో తెలంగాణ ప్రాంతం పరిధిలో ఉన్న చారిత్రక అక్కమహాదేవి గుహలు ఆదరణకు నోచుకోవడం లేదు. ఏపీ ​నుంచి రెగ్యులర్​గా అక్కడి టూరిజం అధికారులు బోట్లు నడిపిస్తున్నారు. తెలంగాణ ఫారెస్ట్​ శాఖకు గుడ్​విల్​ చెల్లిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. తెలంగాణ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఆరు నెలల కింద ఎమ్మెల్యే పట్టుబట్టి ప్రారంభించిన అక్కమహాదేవి గుహల బోటును నిలిపివేశారు. 11వ శతాబ్దంలో వెలుగు చూసిన అక్కమహాదేవి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. 

కృష్ణాతీరంలో సహజ శిలాతోరణంగా ఏర్పడిన గుహలకు కర్నాటక, ఏపీ నుంచి ప్రతిరోజు వేలాది మంది వస్తుంటారు. తెలంగాణ తీర ప్రాంతంలో ఉన్న అక్కమహాదేవి గుహలకు బ్రహ్మగిరి(దోమలపెంట) నుంచి బోటింగ్​ కల్పిస్తే స్థానిక యువతకు ఉపాధితో పాటు ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. వీటితో పాటు దత్తపాదుకలు, కదళీవనానికి ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. 

ఉమామహేశ్వర క్షేత్రంతో పాటు భోగ మహేశ్వరాన్ని అభివృద్ది చేయాల్సి ఉంది. మద్దిమడుగు వరకు మాత్రమే పర్యాటకులు, భక్తులను అనుమతిస్తున్నారు. మల్లెల తీర్థం, లొద్దిమల్లయ్య, సలేశ్వరం జలపాతాలతో కూడిన లోయలు ఉన్న ప్రాంతాలు బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే.

 మల్లెలతీర్థానికి ప్రస్తుతం పర్యాటకులను అనుమతించడం లేదు. భౌరాపూర్​కు శివరాత్రి రోజు మాత్రమే అనుమతిస్తుండగా, శ్రీరామనవమి ముందు సలేశ్వరానికి మూడు రోజులు అనుమతిస్తారు. కుంచోనిమూల గుట్టపై ప్రతాప రుద్రుడి కాలంలో నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీనిపై లండన్​ ఐ తరహాలో జాయింట్​ వీల్​ ఏర్పాటు చేస్తే నల్లమల అందాలను ఆస్వాదించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చూడాల్సినవెన్నో..

నల్లమల అటవీప్రాంతలో నర్సింహుని వాగు, లొద్ది మల్లయ్య, అంతర్గంగ, ఆక్టోపస్​ వ్యూ పాయింట్, వజ్రాల మడుగు, భైరవకోన, గీసుగండి, గున్నపెంట, గుండం,పెద్దమ్మగుడి, మార్కండేయ గుడి వంటి ప్రదేశాలు చూడాల్సిన ప్రదేశాలు. గతంలో నల్లమల టూరిజం సర్క్యూట్​ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం,  సోమశిల నుంచి బ్రహ్మగిరి వరకు అభివృద్ది చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి నిధులు కేటాయించింది.

 సోమశిల, సింగోటం, అక్కమహాదేవి గుహలు, కదళీవనం ప్రదేశాల ప్రస్తావన చేసింది. అక్కమహాదేవి గుహలకు వెళ్లేందుకు రెండు ఫ్లోటింగ్​ జెట్టీలు, పై నుంచి నదితీరం వరకునడక దారి, సోలార్​ లైటింగ్, గుహల లోపల కెమికల్​ ట్రీట్​మెంట్, పర్యాటకులకు కనీస వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించింది. కదళీవనం వెళ్లేందుకు ట్రెక్కింగ్, నడకదారికై మెట్లు తదితర నిర్మాణాల ప్రస్తావన
వచ్చింది.