
బాహుబలి, RRR సినిమాల్లాగే ‘విక్రాంత్ రోణ’ సూపర్ హిట్ అవుతుందని తెలిపారు హీరో నాగార్జున. సుదీప్ హీరోగా నటించిన విక్రాంత్ రోణ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన నాగార్జున సినిమా గురించి చెప్పుకొచ్చారు. ‘‘కిచ్చా సుదీప్, అనూప్ అందరూ నా పాత సినిమాలను గుర్తు చేశారు. సుదీప్.. కన్నడ అబ్బాయి కాదు తెలుగువాడే. తను హైదరాబాద్లోనే ఉంటాడు. సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారు. అందరికీ సుదీప్ నటుడిగా సుపరిచితుడు. ఇప్పుడు విక్రాంత్ రోణ అనే ఒకే చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సాధారణంగా ఇక్కడ ఈ సినిమా తీశారు అని గర్వంగా ఫీలై పెద్ద పోస్టర్స్ పెడతాం. ఇంతకు ముందు బాహుబలి, ఆర్ఆర్ఆర్ పెట్టాం. విక్రాంత్ రోణ ట్రైలర్ రిలీజ్ తర్వాత చూసి అన్నపూర్ణలో పెద్ద పోస్టర్ పెట్టేస్తారనిపించింది. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాను త్రీడీలో తీశారని అంటున్నారు. కచ్చితంగా ఫెంటాస్టిక్గా ఉంటుంది. మా తెలుగు ఆడియెన్స్కు చాలా మంచి మనసు. ఎందుకంటే మా వాళ్లకు సినిమా నచ్చిందంటే తీసుకెళ్లి అక్కడ (పైకి చూపెడుతూ) పెడతారు. విక్రాంత్ సినిమాతో ఆ ఎక్సపీరియెన్స్ను మరోసారి చూడబోతున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ‘‘నేను చూసిన ఫస్ట్ మూవీ రాముడు భీముడు. మా అంకుల్ టీవీ కొన్నాడని తెలియగానే అదెలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు రాముడు భీముడు సినిమా చూశాను. థియేటర్లో నేను చూసిన తొలి చిత్రం శివ. నాకు భాష రాకపోయినా రెండు రోజుల్లోనే మూడు షోస్ చూశాను. సైకిల్ చైన్తో మరొకరిని కొట్టవచ్చునని అప్పటి వరకు నాకు తెలియలేదు. అది అప్పుడు స్టయిల్గా మారింది. నేను చేసిన ఒక ఫోన్ కాల్తో నాగార్జునగారు ఈరోజు ఇక్కడికి రావటం ఎంతో ఆనందంగా అనిపించింది. విక్రాంత్ రోణ సినిమాకు హైదరాబాద్తో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే 65-70 శాతం సినిమా షూటింగ్ను హైదరాబాద్లోనే చిత్రీకరించాం. అందులో ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోలోనే. 500-600 మంది అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్లో ఉన్నాం. మూడు నెలలు అక్కడ షూటింగ్ చేసినా ఒక కరోనా కేస్ కూడా రాలేదు. ఆర్ట్ డైరెక్టర్ శిబు లేకుండా ఉండుంటే అనూప్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుండలేడు. అలాగే అజనీష్ తన మ్యూజిక్తో సినిమాను పది మెట్లు పైకి తీసుకెళ్లాడు. నిర్మాత జాక్ మంజు లేకపోతే సక్సెస్ఫుల్గా జర్నీని పూర్తి చేసేవాళ్లం కాదు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. విక్రాంత్ రోణ చిత్రంతో వన్ ఆఫ్ ది బెస్ట్ 3డీ ఎక్స్పీరియెన్స్ ఫీల్ అవుతారని ప్రామిస్ చేస్తున్నాను" అన్నారు.
సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్పై ఉత్తరాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యానర్పై జాక్ మంజునాథ్ నిర్మించారు. అనూప్ భండారి తెరకెక్కించిన ఈ సినిమా త్రీడీ, 2డీ టెక్నాలజీలో జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.