మద్యానికి బానిసైనవాళ్లు నేరాలకు పాల్పడితే ఉపేక్షించకూడదు: హైకోర్టు తీర్పు

మద్యానికి బానిసైనవాళ్లు  నేరాలకు పాల్పడితే ఉపేక్షించకూడదు: హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: కల్తీ మద్యం, సారా వంటి వాటికి బానిసలయ్యే వాళ్లపై కనికరం చూపాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. వాటి వల్ల ప్రజల జీవితాలు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యమే కాకుండా సమాజానికి కూడా నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వరంగల్‌‌ కలెక్టర్‌‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తన భర్తను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించడాన్ని సవాల్‌‌ చేస్తూ  ఆ జిల్లాలోని మొగిలిచర్ల మండలం గీసుకొండకు చెందిన ధరావత్‌‌ లక్ష్మి వేసిన హెబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు ఇటీవల విచారించింది. 

పిటిషన్‌‌ను డిస్మిస్‌‌ చేస్తూ జస్టిస్‌‌ మౌసుమి భట్టాచార్య, బీఆర్‌‌. మధుసూదన్‌‌రావు ధర్మాసనం తీర్పు చెప్పింది. నిర్బంధంలో ఉన్న నిందితుడిపై కేసుల దర్యాప్తును ఈ ఏడాది డిసెంబర్‌‌ నాటికి పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. తాగి నేరాలకు పాల్పడే వాళ్లపై కనికరం చూపి వదిలేస్తే నేరాల సంఖ్యతోపాటు వాటి ప్రవృత్తి కూడా మారిపోతుందని హెచ్చరించింది. 

ఈ కేసులో నిందితుడిపై పీడీ యాక్ట్‌‌ను అమలు చేయడాన్ని సమర్థించింది. ఇదే సమయంలో దర్యాప్తునకు గడువు కావాలంటూ నిందితుడి నిర్బంధాన్ని కొనసాగించకూడదనడం సరికాదని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్‌‌ 31లోగా దర్యాప్తును ముగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.