
బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్ వద్ద హైవే మూల మలుపులో ఆదివారం రెండు కార్లు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చర్లపల్లికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఐనవోలు మల్లన్న దర్శనం చేసుకుని కొమురవెల్లికి వెళ్తున్నారు.
జనగామ, వరంగల్ పట్టణాలకు చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు సిద్దిపేటకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలింపూర్లోని మూలమలుపు వద్ద ప్రమాదవ శాత్తు వాహనాలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు కార్లలో ఎయిర్ బెలూన్లూ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. బచ్చన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏడాదిలో ఏడు ప్రమాదాలు..
ఏడాది నుంచి దుద్దెడ నుంచి జనగామ వరకు హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనులు అంతటా పూర్తయినా ఆలింపూర్ లో అసంపూర్తిగా నిలిచాయి. దీంతో ఇక్కడ ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా మారింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హైవే పనులు ప్రారంభమైన ఏడాది నుంచి ఈ మూలమలుపు వద్ద ఏడు ప్రమాదాలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతనెల 30న ఇక్కడే రెండు కార్లు ఢీకొనగా, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఏప్రిల్ 17న విజయవాడ నుంచి మామిడికాయల లోడుతో మహారాష్ట్రకు వెళ్తున్న లారీ బోల్తా పడింది. అంతకుముందు ఓ షిఫ్ట్కారు రోడ్డు పక్కన కరెంటు పోల్ను ఢీకొట్టింది. రెండు ప్యాసింజర్ ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. జనగామ నుంచి చేర్యాలకు వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. ఇలా ఏడాది కాలంలోనే ఏడు ప్రమాదాలు జరుగగా, హైవే ఆఫీసర్లు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.