కాశీ నుంచి డిబ్రూగఢ్‌కి రివర్ క్రూయిజ్.. 13న లాంచ్ చేయనున్న ప్రధాని

కాశీ నుంచి డిబ్రూగఢ్‌కి రివర్ క్రూయిజ్.. 13న లాంచ్ చేయనున్న ప్రధాని

భారతదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం వారణాసి నుంచి అసోంలోని డిబ్రూగఢ్ వరకు 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ రివర్ క్రూయిజ్ (నదీ జల నౌకా ప్రయాణం)ను ఏర్పాటు చేయబోతోంది. ఈ విలాసవంతమైన నౌకా ప్రయాణాన్ని జనవరి 13న ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. 50 రోజుల పాటు 27 నదుల గుండా ఈ లగ్జరీ క్రూయిజ్ సాగనుంది. అంతేకాకుండా ఈ క్రూయిజ్ షిప్ పర్యాటకులకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 వారసత్వ సంపదలుగా భావించే ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తోంది. దాంతో పాటు అదనంగా సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్ పార్క్‌తో సహా జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా కూడా ఈ షిప్ వెళ్ళనుంది. 

నదీ మార్గంలో సాగే ఈ నౌకా ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైనది కావడం విశేషం. గంగ, భాగీరథి, హుగ్లీ, బ్రహ్మపుత్ర, వెస్ట్ కోస్ట్ కెనాల్ వంటి 27 నదుల గుండా సాగనున్న ఈ క్రూయిజ్ మాదిరి నౌక.. ప్రపంచంలో ఇంత సుదీర్ఘమైన రివర్ క్రూయిజ్ మరొకటి లేదని ఇటీవలే ప్రధాని మోడీ వెల్లడించారు. దేశంలో నౌకా ప్రయాణ పర్యాటకం అభివృద్ధి చెందుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను వరల్డ్ లాంగెస్ట్ రివర్ క్రూయిజ్ పేరుతో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గత కొన్ని రోజుల క్రితమే ట్వీట్ చేశారు. దాంతో పాటు ఈ గంగా విలాస్ పవిత్ర వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్ వరకు భారతదేశంలోని రెండు గొప్ప నదులైన గంగా, బ్రహ్మపుత్ర మీదుగా 4,000 కి.మీ. ప్రయాణించనుందని చెప్పారు.

ముందుగా విడుదల చేసిన టైమ్‌ టేబుల్ ప్రకారం.. గంగా విలాస్ క్రూజ్ వారణాసి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, బక్సర్ , రామ్‌నగర్, ఘాజీపూర్ మీదుగా 8వ రోజు పాట్నా చేరుకుంటుంది. పాట్నా నుంచి కోల్‌కతాకు బయలుదేరి ఫరక్కా, ముర్షిదాబాద్ మీదుగా 20వ తేదీన పశ్చిమబెంగాల్ రాజధానికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఢాకాకు బయలుదేరి బంగ్లాదేశ్ సరిహద్దులోకి ప్రవేశిస్తుంది. ఇది రాబోయే 15 రోజుల పాటు దేశ జలాల్లోనే ఉంటుంది. చివరగా.. ఇది సిబ్‌సాగర్ మీదుగా ప్రయాణించి దిబ్రూఘర్‌లో తన చివరి గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందు గౌహతి ద్వారా భారతదేశానికి తిరిగి వస్తుంది .

అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. గంగా విలాస్ -80 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 18 సూట్‌లు, అన్ని ఇతర అనుబంధ సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన రివర్ క్రూయిజ్ నౌక. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేకమైన డిజైన్ తో కూడిన నౌకను నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రూయిజ్ లో ప్రతి క్షణాన్నీ ఆనందదాయకంగా మార్చడానికి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ - ఎయిర్ అబ్జర్వేషన్ డెక్ లాంటి ఇతర సౌకర్యాలు ఉండనున్నాయి.