హైదరాబాద్, వెలుగు: పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడారు. గత ఆరు నెలలుగా విద్యార్థులతో కలిసి శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ఈ సమస్యపై ఇప్పటికే కలెక్టరేట్ల ముట్టడులు, సచివాలయం ముట్టడి, నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు.
అవసరమైతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 2న జరిగిన కాలేజీల బంద్కు స్వచ్ఛందంగా సహకరించిన ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు, అలాగే అఖిలపక్షాలు, విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
