ముషీరాబాద్,వెలుగు: విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్న జీవో నంబర్- 9ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుంచి విద్యానగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవద్దన్నారు. రోజురోజుకు తీవ్రం అవుతున్న ఈ సమస్యపై సీఎం జోక్యం చేసుకొని పరిష్కరించాలన్నారు. బకాయిల కోసం ఈ నెల 8న ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు పగిళ్ల సతీష్, మోడీ రాందేవ్, గుజ్జ కృష్ణ, వంశీ, బాలయ్య పాల్గొన్నారు.
