
బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు సభకు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇప్పటి నుంచే ప్రచారాన్నిహోరెత్తించేందుకు బీజేపీ సిద్ధమైంది. అందులో భాగంగానే.. ఈరోజు ( ఏప్రిల్ 23) తెలంగాణలోని చేవెళ్లలో… భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభ కోసం 10 రోజుల ముందు నుంచే బీజేపీ వర్గాలు భారీ కసరత్తు చేస్తున్నాయి. సభకు ఎంత మందిని తరలించాలనే అంశం మొదలు… సభలో అమిత్ షా ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనే అంశంవరకూ… అన్నింటినీ ఆ పార్టీ లోతుగా విశ్లేషించుకుంటోంది.
సాయంత్రం 5 గంటలకు అమిత్ షా
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా చేవెళ్లకు 6 గంటలకు వెళ్తారు. రాత్రి 7 గంటలకు సభలో ప్రసంగించనున్నారు. ఆ తరువాత రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కిన తరుణంలో అమిత్ షా పర్యటన మరింత వేడి రాజేస్తోంది.
బహిరంగ సభ ఉద్దేశం ఏంటి?
దేశంలో మొదటి విడతగా 144 పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు లబ్దిదారులను నేరుగా కలిశారు. ఈ సమయంలోనే రాష్ట్ర బీజేపీ కేడర్ తో కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో అమిత్ షా బహిరంగ సభను రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు.