వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిచ్చిన హైకోర్ట్

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిచ్చిన హైకోర్ట్

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అనంతంరం వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని కోర్టు, పోలీసులను ఆదేశించింది. అయితే సీఎం కేసీఆర్ పై మతపరమైన, రాజకీయ అంశాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నిన్న వరంగల్ లో బస్సుకు నిప్పుపెట్టిన టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చింది.  ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో వెళ్తున్న ఆమెను  పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  షర్మిల, పోలీసుల మధ్య వాగ్వాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయినా ఆమె కారు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రాఫిక్ జామ్, శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిన పోలీసులు... టోయింగ్ వెహికిల్ రప్పించి షర్మిల కారులో ఉండగానే దాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పోలీసుల వైఖరిపై వైఎస్సార్ టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు బిల్డింగ్ ఎక్కి నిరసన చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.