- అనుబంధ సంస్థల్లో వాటా తగ్గింపు
- మళ్లీ క్లౌడ్టేల్ అమ్మకాలు షురూ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి న కొత్త ఎఫ్డీఐ రూల్స్కు అనుగుణంగా అమెజాన్ డాట్ఇన్ తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకుంది. తన సైట్/యాప్లో అతిపెద్ద సెల్లర్లు అయిన క్లౌడ్టేల్లో వాటాలను తగ్గించుకోవడంతో తిరిగి ఇది అమ్మకాలను మొదలుపెట్టింది. ఈ నెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చి రూల్స్ ప్రకారం.. తనకు వాటాలు ఉన్న క్లౌడ్టేల్ వంటి సంస్థలు వస్తువులను అమ్మకూడదు. భారీ డిస్కౌంట్లు ఇవ్వకూడదు. ఎక్స్క్లూజివ్ డీల్స్ కుదుర్చు కోకూడదు. దీంతో క్లౌడ్టేల్, అప్పారియోలను లక్షల వస్తువులను ఉపసంహరించుకున్నాయి. వీటిలో అమెజాన్ కు 49 శాతానికిపైగా ఈక్విటీ ఉంది. కొత్త నియమాలకు అనుగుణంగా అమెజాన్ వీటిలో వాటాను 24 శాతానికి పరిమితం చేసుకుంది. ఫలితంగా క్లౌడ్టేల్ తిరిగి మూడు లక్షల వస్తువులను అమెజాన్ లో లిస్ట్ చేసింది. క్లౌడ్టేల్లో మిగతా వాటా కాటమరన్ వెంచర్స్ దక్కించుకుంది. ఈ వివరాలను వెల్లడించేందుకు మాత్రం అమెజాన్ ఇష్టపడలేదు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడికి చెందిన కాటమరన్ ఈ విషయమై స్పందిస్తూ ఎఫ్డీఐ రూల్స్కు అనుగుణంగా మార్పులు మాత్రమే చేశామని తెలిపింది.
అప్పారియోలోనూ…
క్లౌడ్టేల్లో మాదిరిగానే అప్పారియోలోనూ వాటాలను తగ్గించుకోవడంపై అమెజాన్ దృష్టి సారించింది. అమెజాన్ , ఫ్లిప్కార్ట్లు తమ సొంత వెండర్ల ద్వారా భారీ డిస్కౌంట్లు ఇస్తూ ఇతర సెల్లర్లకు అన్యాయం చేస్తున్నాయని చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం తెలిసిందే. అయితే క్లౌడ్టేల్ను అమెజాన్ ను మళ్లీ తీసుకురావడం నియమాలకు విరుద్ధమని ‘కాన్ఫి డరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్’ (సీఏఐటీ) ఆక్షేపించింది. సొంత వెండర్స్లో అమెజాన్ , ఫ్లిప్కార్ట్లకు వాటాలు ఉండటంపై కేంద్ర పరిశ్రమలశాఖను వివరణ కోరుతామని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఎఫ్డీఐ రూల్స్కు వ్యతిరేకంగా అమెజాన్ , ఫ్లిప్కార్ట్ చేసిన లాబీయింగ్ విఫలమైన సంగతి తెలిసిందే.
రూల్స్ అమలుకు కనీసం గడువు పెంచాలన్న విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చిరు వ్యాపారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. అమెజాన్ చాలా వస్తువుల అమ్మకాలను నిలిపివేసినప్పటికీ, ఫ్లిప్కార్ట్కు తన వెండర్లలో ఈక్విటీ హోల్డింగ్స్ లేకపోవడంతో పెద్దగా ఇబ్బందిపడలేదు. అయితే కొత్త రూల్స్ రావడానికి ముందే ఈ సైట్ నుంచి చాలా మంది వెండర్లు తమ వస్తువులను తొలగించారు. దీంతో ఫ్లిప్కార్ట్తో వారితో చర్చలు జరుపుతోంది.
