
సుహాస్(Suhas), శివాని(Shivani) జంటగా శరణ్య ప్రదీప్(Sharanya Pradeep) కీలకపాత్రలో దుశ్యంత్ కటికినేని(Dushyanth katikineni) తెరకెక్కించిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు(Ambajipeta Marriage Band). జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించాయి. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హీరో అడివి శేష్ మాట్లాడుతూ ‘సుహాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు అరుదుగా ఉంటారు. ఏదో ఒక రోజు తను నా ఈవెంట్కు అతిథిగా రావాలి. ట్రైలర్ ను పది సార్లు చూశా.
అంత బాగా నచ్చింది. సుహాస్, శరణ్య, శివానీ పోటీపడి నటించారు’ అని చెప్పాడు. నిర్మాతలు బన్నీ వాస్, ఎన్కేఎన్, దర్శకులు సాయి రాజేష్, కరుణ కుమార్, అనిల్ విశ్వనాథ్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ‘గీతా ఆర్ట్స్లో హీరోగా సినిమా చేస్తున్నానంటే నా తల్లిదండ్రులే నమ్మలేదు. అలాంటి అవకాశం ఇచ్చిన బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఇందులో ఇచ్చానని చెప్పగలను. దర్శకుడు దుశ్యంత్ వల్లే ఇది సాధ్యమైంది’ అని చెప్పాడు. సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు ఎంతగా నచ్చాయో సినిమా అంతకంటే బాగుంటుంది’ అని దర్శకుడు చెప్పాడు.
తమ కెరీర్స్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని శివాని, శరణ్య ప్రదీప్, నితిన్ అన్నారు. నిర్మాత ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ ‘ఎంతో సహజంగా, నిజ జీవితానికి దగ్గరగా ఈ స్క్రిప్ట్ రెడీ చేసిన దుశ్యంత్.. గత రెండేళ్లుగా దీనిపై పనిచేశాడు. సుహాస్ ఏడాది పాటు మరే సినిమా చేయకుండా ఫోకస్ చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి గట్స్ ఉండాలి. హీరోయిన్ శివాని, శరణ్య, నితిన్, టెక్నీషియన్స్ అంతా సొంత ప్రాజెక్ట్లా వర్క్ చేశారు’ అని చెప్పారు. నటి గాయత్రి భార్గవి, లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి, ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.