సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుడు అంబేద్కర్:- సీఎం జగన్

సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుడు అంబేద్కర్:- సీఎం జగన్

బెజవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుడి విగ్రహం విజయవాడలో ఆవిష్కృతమైందన్నారు. బాబా సాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చెప్పారు. మన అడుగుల్లో ఆయన ఎప్పటికీ కనిపిస్తారని అన్నారు.

పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటి కంటే పెద్దది అని వెల్లడించారు.  అంబేద్కర్ భావజాలం పెత్తందార్లకు నచ్చదని అన్నారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగ హక్కులు, న్యాయాల ద్వారా మనల్ని నిరంతరం కాపాడే ఒక మహా శక్తిగా ఆయన మనందరికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. గొంతు వినిపించలేని అట్టడగువర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి, రిజర్వేషన్లు కల్పించడానికి కారకులు అంబేద్కర్. నేడు దళిత జాతి నిలబడిందంటే వారికి అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించడమే కారణం. దళితులను ఏకతాటిపైకి తెచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందని విన్నాం. ఇక స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ పేరు మారుమోగుతుంది” అని సీఎం జగన్ అన్నారు.

విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. 18 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసి అందులో 206 అడుగులున్న అంబేద్కర్ మహాశిల్పాన్ని సీఎం ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా.. పీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. విజయవాడలో నెలకొల్పిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ వస్తువులతోనే రూపొందించారు. ఇందుకోసం రూ.404.35 కోట్లు ఖర్చు చేశారు. 18.18 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. పీఠంపై జీ ప్లస్ 2 తరహాలో గదులు నిర్మించారు. పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.  రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యకమంలో డ్రోన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.