అమాయకుల ఇళ్లనే టార్గెట్ చేస్తున్నరు .. తహసీల్దార్​తో గొడవకు దిగిన శెట్టికుంట బాధితులు

అమాయకుల ఇళ్లనే టార్గెట్ చేస్తున్నరు .. తహసీల్దార్​తో గొడవకు దిగిన శెట్టికుంట బాధితులు

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: అమీన్​పూర్​ మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు పైసలకు అమ్ముడుపోయి అమాయకుల ఇళ్లపై తమ ప్రతాపం చూపిస్తున్నారని శెట్టి కుంట సర్వే నంబర్​ 947 కాలనీ వాసులు ఆరోపించారు. అసలు సూత్రదారుల ఇళ్లను వదిలేసి తమ ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. శనివారం అమీన్​పూర్​ తహసీల్దార్​ ఆఫీసు వద్దకు కాలనీ వాసులు పెద్ద ఎత్తున చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్​ వెంకటేశ్​తో గొడవకు దిగారు. ఈ సందర్భంగా ఐలాపూర్​ మాజీ సర్పంచ్​ మల్లేశ్​ మాట్లాడుతూ.. అధికారులను మ్యానేజ్​ చేసిన వారి నిర్మాణాలను ముట్టుకోకుండా పేదల ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 

పలుకుబడి కలిగిన ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను నిర్మించి అమాయకులకు అంటగడుతన్నాడని అధికారులు సైతం తాయిలాలకు అలవాటు పడి ఆ నిర్మాణాల వద్దకు వెళ్లడం లేదని ఆరోపించారు. గృహప్రవేశం చేసిన ఇంటి నుంచి మహిళలను బయటకు గెంటి వేసి కూల్చారని కానీ సదరు వ్యక్తి నిర్మాణాలను కనీసం ముట్టు కోలేదన్నారు. డబ్బులు ముట్టజెప్పిన నిర్మాణాలను వదిలి పేదల ఇళ్లపై పడ్డారని కలెక్టర్​ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని లేదంటే తహసీల్దార్ ఆఫీసు ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కూల్చివేశామని తగిన విచారణ జరిపి 947 లోని మరిన్ని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్​ వెంకటేశ్ వారికి నచ్చజెప్పారు.