రక్షణ బడ్జెట్ పై నాటో కీలక నిర్ణయం.. భారీగా పెరుగుతున్న ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ఇవే..

రక్షణ బడ్జెట్ పై నాటో కీలక నిర్ణయం.. భారీగా పెరుగుతున్న ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ఇవే..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన చూసినా యుద్ధాలు, గొడవలతో ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాలకు పెరుగుతున్న ఆర్థిక ఆయుధ సంపత్తి గొడవలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో నాటో తీసుకున్న రక్షణ నిర్ణయాలు భారత స్టాక్ మార్కెట్లలో డిఫెన్స్ స్టాక్స్ కి కొత్త రెక్కలు వచ్చేలా చేశాయి.

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మిత్రదేశాలు 2035 నాటికి తమ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచాలని చూస్తు్న్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి బలమైన ఒత్తిడి తర్వాత నాటో దేశాధినేతలు వ్యయ పెంపులకు ఆమోదం తెలిపారు. దీని కింద బడ్జెట్ అలకేషన్ జీడీపీలో రక్షణకు 2 నుంచి 5 శాతానికి పెంచాలని నిర్ణయించారు. దాడులు జరిగిన సమయంలో ఒకరికొకరు అండగా నిలవడానికి ఇది దోహదపడుతుందని వారు చెబుతున్నారు.

ఈ వార్తల తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, అపోలో మైక్రో సిస్టమ్స్ సహా మరిన్ని రక్షణ రంగంలోని కంపెనీల షేర్లు నేడు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. దీనికి కారణం 2016 ఆర్థిక సంవత్సరం నుంచి భారత డిఫెన్స్ కంపెనీల ఎగుమతులు 13 రెట్లు పెరగటమే కారణం. ఈ క్రమంలో ప్రైవేటు సంస్థల నుంచి రక్షణ ఎగుమతులు ఏకంగా 67 రెట్లు పెరుగుదలను నమోదు చేశాయి. అయితే అంచనాల ప్రకారం 2028-29 నాటికి రక్షణ ఎగుమతులు రూ.5 లక్షల కోట్లకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో నిఫ్టీ ఇండియా డిఫెన్స్ 1 శాతం పెరుగుదలను ఇంట్రాడేలో నమోదు చేసింది. 

ముఖ్యంగా క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, సాయుధ వాహనాలు వంటి ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో డ్రోన్స్ కి డిమాండ్ పెరుగుతున్నందున సమీప భవిష్యత్తులో వాటి ఎగుమతులు కూడా భారీగా పెరగవచ్చని అంచనా వేయబడింది. 2020-24 మధ్య కాలంలో ప్రపంచ డిఫెన్స్ ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. అయితే దిగుమతుల విషయానికి వస్తే భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత్ తన ఉత్పత్తులను 85 దేశాలకు ఎగుమతి చేసినట్లు వెల్లడైంది. ఇందులో యూఎస్, ఫ్రాన్స్, అర్మేనియా వంటి దేశాలు కూడా ఉండటం గమనార్హం.