
- 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తం: అమిత్ షా
- ఆపరేషన్ సిందూర్తో పాక్కు నిద్ర లేకుండా చేసినం
- కేసీఆర్ భారీ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ చర్యలేవి?
- రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజల తలరాత మారలే
- బీజేపీ పవర్లోకి వస్తేనే మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య
- నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీసుకు ప్రారంభోత్సవం
- ఇక్కడే భారత్ ఎక్స్పోర్ట్,
- ఆర్గానిక్ కోఆపరేటివ్ ఆఫీస్ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
నిజామాబాద్, వెలుగు: నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి, సరెండరై జనజీవన స్రవంతిలో కలువాలన్నారు. ‘‘వెపన్స్ దగ్గరున్న వారితో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ చర్చించే ప్రసక్తేలేదు. ఇదే మా పాలసీ. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తం” అని పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో మాట్లాడారు. ‘‘40 ఏండ్ల నుంచి 40 వేల మంది ఆదివాసీలను నక్సలైట్లు పొట్టనబెట్టుకున్నరు. ప్రజల రక్షణ కోసం పనిచేసే ఎంతో మంది పోలీసులను బలితీసుకున్నరు. వారితో చర్చలు జరుపాలని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కోరడం విచిత్రంగా ఉంది. నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆదివాసీలు, పోలీస్ కుటుంబాలకు కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తరు?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. నక్సలైట్ల వల్ల ఆదివాసీల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఏడాదిన్నర కాలంలో 2 వేల మంది మావోయిస్టులు సరెండరయ్యారని, ఇంకా ఉన్నవాళ్లు అదే దారిలో సరెండర్ కావాలని ఆయన చెప్పారు. ‘‘నక్సల్స్తో చర్చలు చేపట్టాలంటున్న తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ వారికి ఆశ్రయం ఇస్తున్నదోనని ఆందోళనగా ఉంది. ఆపరేషన్ కగార్తో పారిపోతున్న నక్సలైట్లు తెలంగాణలో రక్షణ తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం వారిని వదలదు” అని అన్నారు.
కేసీఆర్ అవినీతిపై కేసులెక్కడ..?
గత బీఆర్ఎస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడింని అమిత్షా ఆరోపించారు. ‘‘కాళేశ్వరం, ధరణి, సింగరేణి.. ఇట్లా అన్నింటినీ ఆదాయ వనరులుగా వాడుకున్నరు. కేసీఆర్ ఆధ్వర్యంలోని అవినీతిని గ్రహించిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. కేసీఆర్ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క కేసైనా నమోదు చేసిండా ఆలోచించాలి” అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొని పాలకులను మార్చారేగానీ వారి రాతలు ఏమాత్రం మారలేదని అమిత్ షా తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతిలో రాటుదేలాయని ఆరోపించారు. బీజేపీ పాలన తెలంగాణలో వస్తేనే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘రైతులు, దళితులు, ఆదివాసీలు, యూత్, మహిళా, ఓబీసీల వికాసం ప్రధాని మోదీ వల్లే అవుతుంది. రైతు సంక్షేమం కోసం సెంట్రల్ బడ్జెట్ మరో రూ.లక్ష కోట్లు పెంచి స్కీమ్లు కంటిన్యూ చేస్తున్నది. ఎకరానికి యాడాదికి రూ.6 వేలు, రైతు బీమా, సబ్సిడీపై యూరియా అందిస్తున్నది. ఇప్పుడు పసుపు రైతుల కోసం బోర్డును కూడా ఏర్పాటు చేసింది” అని ఆయన తెలిపారు.
పాక్కు నిద్ర దూరం చేసినం
దేశ రక్షణ విషయంలో మోదీ సర్కార్ రాజీపడబోదని అమిత్ షా అన్నారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్కు భారత్ బలమేంటో స్పష్టంగా తెలియజేశాం. మోదీ పాలన వచ్చిన పదేండ్లలో మూడుసార్లు పాక్కు తగిన రీతిలో బుద్ధి చెప్పినం. సర్జికల్ స్ట్రయిక్, ఎయిర్ స్ట్రయిక్, తాజాగా పాక్ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపుదాడి చేసి.. ఉగ్రవాదులను తుదముట్టించినం. భారత సైనికులు సత్తా చాటారు” అని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులు చేసి దర్జాగా వెళ్లిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ‘‘ఆపరేషన్ సిందూర్ రిజల్ట్పై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఆధారాలు అడుగడం విడ్డూరంగా ఉంది. ఆటంబాంబ్ ఉందని బెదిరించిన పాక్ తీరును ఇప్పుడు స్పష్టంగా గమనిస్తే సిందూర్ విజయం ఏమిటో రాహుల్కు అర్థమవుతుంది. భారత్ను నిద్రపోనివ్వనని విర్రవీగిన పాకిస్తాన్కు నిద్ర దూరం చేసినం” అని ఆయన అన్నారు.
కొట్లాడి పసుపు బోర్డు సాధించుకున్నరు: బండి సంజయ్
నిజామాబాద్ జిల్లా రైతులు కొట్లాడి పసుపు బోర్డును సాధించుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లాను పసుపుకు దేశ రాజధాని చేశారని పేర్కొన్నారు. రైతును మహారాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని తెలిపారు.
ఆనందంలో పసుపు రైతులు: ఎంపీ అర్వింద్
పసుపు బోర్డును సాధించి జిల్లా రైతుల 4 దశాబ్దాల కలను సాకారం చేశానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 188 మంది పసుపు రైతులు పసుపు బోర్డు ఏర్పాటు కావాలనే డిమాండ్తో పోటీ చేశారని గుర్తు చేశారు. 2023లో బోర్డు ఏర్పాటుకు ప్రధాని మోదీ ప్రకటన చేయడంతో వారు 2024లో తనకు మద్దతిచ్చారని తెలిపారు. బోర్డు ఆఫీస్ ప్రారంభోత్సవంతో పసుపు రైతులు అనందంలో మునిగిపోయారని అన్నారు.
నమ్మకం నిలబెడతా: బోర్డు చైర్మన్ గంగారెడ్డి
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను బోర్డుకు మొదటి చైర్మన్గా చేసినందుకు పల్లె గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనకు దక్కిన అవకాశాన్ని పూర్తి నమ్మకంతో నిలబెడతానన్నారు.
ఇందూరులో ఎక్స్పోర్టు, ఆర్గనిక్ బ్రాంచ్లు
నిజామాబాద్ జిల్లాలో సాగు చేసే పసుపుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని అమిత్ షా తెలిపారు. అంతటి ఖ్యాతి పొందిన పసుపు రైతులకు గుర్తింపునిస్తూ ఇందూర్ గడ్డపై నేషనల్ టర్మిరిక్ బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక నుంచి పసుపు పంట జాతీయ వ్యవహారాలు నిజామాబాద్ హెడ్ క్వార్టర్గా డిసైడవుతాయని తెలిపారు. ‘‘క్వింటాల్ పసుపు రేట్ వచ్చే మూడేండ్లలో రూ.19 వేలకు చేరే అవకాశం వస్తుంది. 2030 నాటికి పసుపు ఎగుమతులతో మిలియన్ డాలర్ల ప్రపంచ బిజినెస్ టార్గెట్ పెట్టుకున్నం. అందులో భాగంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఇందూరులో భారత్ ఎక్స్పోర్టు, భారత్ ఆర్గనిక్ కోఆపరేటివ్ ఆఫీస్ బ్రాంచ్లు త్వరలో ఏర్పాటు చేస్తం” అని చెప్పారు. పసుపు ఎగుమతులకు సంబంధించి అనేక రకాల శిక్షణ రైతులకు ఇస్తామని.. ఆర్గనిక్ పసుపు సాగు చేస్తే అమెరికా, యూరప్, కెనాడా, ఆస్ట్రేలియా, వియత్నాం, స్విస్ దేశాలకు పంపుతామని తెలిపారు. పసుపు సాగు లాభాలను వ్యాపారులు కాకుండా రైతులు పొందాలనే సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని అమిత్ షా పేర్కొన్నారు. ఔషద గుణాలున్న పసుపు కోసం విశ్వవ్యాప్తంగా డిమాండ్ ఉందని, ఆ డిమాండ్ రైతులకు ఉపయోగపడేలా పసుపు బోర్డు పనిచేస్తుందన్నారు.
కరెంట్కోతల్లేని దేశాన్ని నిర్మిస్తం: కిషన్రెడ్డి
కరెంట్కోతల్లేని నూతన భారత్ను మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. యూరియా బ్యాగ్పై రూ.3,500 సబ్సిడీ భరిస్తూ కేవలం రూ.267 రేట్కు రైతులకు అందిస్తున్నామని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి తెలంగాణ రైతులకు అంకితం చేశామని చెప్పారు. నిజామాబాద్ పసుపు రైతుల కోసం ఇప్పుడు బోర్డు ను ఏర్పాటు చేసి గొప్ప కానుక ఇచ్చిందన్నారు.
రైతు ఆదాయం రెట్టింపు చేయాలె : మంత్రి తుమ్మల
రాష్ట్రంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా రైతుల సంక్షేమం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని తెలిపారు. గిట్టుబాటు ధర, పసుపు ఎగుమతులు, రీసెర్చ్, మార్కెటింగ్ అంశాల్లో రైతులకు లాభం చేకూర్చే నిర్ణయాలు బోర్డు తీసుకోవాలని సూచించారు.