నక్సలైట్లు సరెండర్ కావాలి.. ఆయుధాలు పట్టుకున్నోళ్లతో చర్చల్లేవ్

నక్సలైట్లు సరెండర్ కావాలి.. ఆయుధాలు పట్టుకున్నోళ్లతో చర్చల్లేవ్
  • 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తం: అమిత్​ షా
  • ఆపరేషన్​ సిందూర్​తో పాక్​కు నిద్ర లేకుండా చేసినం
  • కేసీఆర్​ భారీ అవినీతిపై కాంగ్రెస్​ సర్కార్​ చర్యలేవి?
  • రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజల తలరాత మారలే
  • బీజేపీ పవర్​లోకి వస్తేనే మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య
  • నిజామాబాద్​లో జాతీయ పసుపు బోర్డు ఆఫీసుకు ప్రారంభోత్సవం
  •  ఇక్కడే భారత్​ ఎక్స్​పోర్ట్​, 
  • ఆర్గానిక్​ కోఆపరేటివ్​ ఆఫీస్​ బ్రాంచ్​లు ఏర్పాటు చేస్తామని వెల్లడి

నిజామాబాద్, వెలుగు: నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్​షా స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి, సరెండరై జనజీవన స్రవంతిలో కలువాలన్నారు. ‘‘వెపన్స్​ దగ్గరున్న వారితో  మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్​ చర్చించే ప్రసక్తేలేదు. ఇదే మా పాలసీ.  2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తం” అని పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్​లో జాతీయ పసుపు బోర్డు  ఆఫీస్​ను అమిత్​ షా ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో మాట్లాడారు.  ‘‘4‌‌0 ఏండ్ల నుంచి 40 వేల మంది ఆదివాసీలను నక్సలైట్లు పొట్టనబెట్టుకున్నరు. ప్రజల రక్షణ కోసం పనిచేసే ఎంతో మంది పోలీసులను బలితీసుకున్నరు. వారితో చర్చలు జరుపాలని తెలంగాణలోని కాంగ్రెస్​ సర్కార్​ కోరడం విచిత్రంగా ఉంది. నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆదివాసీలు, పోలీస్​ కుటుంబాలకు కాంగ్రెస్​ నేతలు ఏం సమాధానం చెప్తరు?’’  అని అమిత్​ షా ప్రశ్నించారు. నక్సలైట్ల వల్ల ఆదివాసీల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఏడాదిన్నర కాలంలో 2 వేల మంది మావోయిస్టులు సరెండరయ్యారని, ఇంకా ఉన్నవాళ్లు అదే దారిలో సరెండర్​ కావాలని ఆయన చెప్పారు. ‘‘నక్సల్స్​తో చర్చలు చేపట్టాలంటున్న తెలంగాణ గవర్నమెంట్​ ఎక్కడ వారికి ఆశ్రయం ఇస్తున్నదోనని ఆందోళనగా ఉంది. ఆపరేషన్​ కగార్​తో పారిపోతున్న నక్సలైట్లు తెలంగాణలో రక్షణ తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం వారిని వదలదు” అని అన్నారు. 

కేసీఆర్​ అవినీతిపై కేసులెక్కడ..?

గత బీఆర్​ఎస్​ సర్కార్​ భారీ అవినీతికి పాల్పడింని అమిత్​షా ఆరోపించారు. ‘‘కాళేశ్వరం, ధరణి, సింగరేణి.. ఇట్లా అన్నింటినీ ఆదాయ వనరులుగా వాడుకున్నరు. కేసీఆర్  ఆధ్వర్యంలోని అవినీతిని గ్రహించిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్​కు అధికారం కట్టబెడితే.. కేసీఆర్​ అవినీతిపై సీఎం రేవంత్​ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క కేసైనా నమోదు చేసిండా ఆలోచించాలి” అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొని పాలకులను మార్చారేగానీ వారి రాతలు ఏమాత్రం మారలేదని అమిత్​ షా తెలిపారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండూ అవినీతిలో రాటుదేలాయని ఆరోపించారు. బీజేపీ పాలన తెలంగాణలో వస్తేనే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘రైతులు, దళితులు, ఆదివాసీలు, యూత్​, మహిళా, ఓబీసీల వికాసం ప్రధాని మోదీ వల్లే అవుతుంది. రైతు సంక్షేమం కోసం సెంట్రల్​ బడ్జెట్​ మరో రూ.లక్ష కోట్లు పెంచి   స్కీమ్​లు కంటిన్యూ చేస్తున్నది. ఎకరానికి యాడాదికి రూ.6 వేలు, రైతు బీమా, సబ్సిడీపై యూరియా అందిస్తున్నది. ఇప్పుడు పసుపు రైతుల కోసం బోర్డును కూడా ఏర్పాటు చేసింది” అని ఆయన తెలిపారు. 

పాక్​కు నిద్ర దూరం చేసినం

దేశ రక్షణ విషయంలో మోదీ సర్కార్ రాజీపడబోదని అమిత్​ షా అన్నారు. ‘‘పహల్గామ్​ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్​కు భారత్​ బలమేంటో స్పష్టంగా తెలియజేశాం. మోదీ పాలన వచ్చిన పదేండ్లలో మూడుసార్లు పాక్​కు తగిన రీతిలో బుద్ధి చెప్పినం. సర్జికల్​ స్ట్రయిక్​, ఎయిర్​ స్ట్రయిక్​, తాజాగా పాక్​ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపుదాడి చేసి.. ఉగ్రవాదులను తుదముట్టించినం. భారత సైనికులు సత్తా చాటారు” అని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు పాక్​ నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులు చేసి దర్జాగా వెళ్లిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ‘‘ఆపరేషన్​ సిందూర్​ రిజల్ట్​పై కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ  ఆధారాలు అడుగడం విడ్డూరంగా ఉంది. ఆటంబాంబ్​ ఉందని బెదిరించిన పాక్​ తీరును ఇప్పుడు స్పష్టంగా గమనిస్తే సిందూర్​ విజయం ఏమిటో రాహుల్​కు అర్థమవుతుంది. భారత్​ను నిద్రపోనివ్వనని విర్రవీగిన పాకిస్తాన్​కు నిద్ర దూరం చేసినం” అని ఆయన అన్నారు. 

కొట్లాడి పసుపు బోర్డు సాధించుకున్నరు: బండి సంజయ్​

నిజామాబాద్​ జిల్లా రైతులు  కొట్లాడి పసుపు బోర్డును  సాధించుకున్నారని కేంద్ర  మంత్రి బండి సంజయ్​ అన్నారు.  జిల్లాను పసుపుకు దేశ రాజధాని చేశారని పేర్కొన్నారు. రైతును మహారాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని తెలిపారు. 

ఆనందంలో పసుపు రైతులు:  ఎంపీ అర్వింద్​

పసుపు బోర్డును సాధించి జిల్లా రైతుల 4 దశాబ్దాల కలను సాకారం చేశానని  నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ పేర్కొన్నారు. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో  188 మంది  పసుపు రైతులు పసుపు బోర్డు ఏర్పాటు కావాలనే డిమాండ్​తో  పోటీ చేశారని గుర్తు చేశారు.  2023లో  బోర్డు ఏర్పాటుకు ప్రధాని మోదీ  ప్రకటన చేయడంతో వారు   2024లో   తనకు మద్దతిచ్చారని తెలిపారు. బోర్డు ఆఫీస్​ ప్రారంభోత్సవంతో పసుపు రైతులు అనందంలో మునిగిపోయారని అన్నారు.

నమ్మకం నిలబెడతా:  బోర్డు చైర్మన్ గంగారెడ్డి

సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను బోర్డుకు మొదటి చైర్మన్​గా చేసినందుకు పల్లె గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనకు దక్కిన అవకాశాన్ని పూర్తి నమ్మకంతో నిలబెడతానన్నారు.

ఇందూరులో ఎక్స్​పోర్టు,  ఆర్గనిక్  బ్రాంచ్​లు

నిజామాబాద్​ జిల్లాలో సాగు చేసే పసుపుకు ప్రపంచ స్థాయిలో  గుర్తింపు ఉందని అమిత్​ షా తెలిపారు. అంతటి ఖ్యాతి పొందిన పసుపు రైతులకు గుర్తింపునిస్తూ ఇందూర్​ గడ్డపై నేషనల్​ టర్మిరిక్​ బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక నుంచి పసుపు పంట జాతీయ వ్యవహారాలు నిజామాబాద్​ హెడ్​ క్వార్టర్​గా డిసైడవుతాయని తెలిపారు. ‘‘క్వింటాల్ పసుపు రేట్​ వచ్చే మూడేండ్లలో రూ.19 వేలకు చేరే అవకాశం వస్తుంది. 2030 నాటికి పసుపు ఎగుమతులతో మిలియన్​ డాలర్ల ప్రపంచ బిజినెస్​ టార్గెట్​ పెట్టుకున్నం. అందులో భాగంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఇందూరులో భారత్​ ఎక్స్​పోర్టు, భారత్​ ఆర్గనిక్​ కోఆపరేటివ్​ ఆఫీస్​ బ్రాంచ్​లు త్వరలో ఏర్పాటు చేస్తం” అని చెప్పారు. పసుపు ఎగుమతులకు సంబంధించి అనేక రకాల శిక్షణ రైతులకు ఇస్తామని.. ఆర్గనిక్​ పసుపు సాగు చేస్తే  అమెరికా, యూరప్​, కెనాడా, ఆస్ట్రేలియా, వియత్నాం, స్విస్​ దేశాలకు పంపుతామని తెలిపారు. పసుపు సాగు లాభాలను వ్యాపారులు కాకుండా రైతులు పొందాలనే సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని అమిత్​ షా పేర్కొన్నారు. ఔషద గుణాలున్న పసుపు కోసం విశ్వవ్యాప్తంగా డిమాండ్​ ఉందని, ఆ డిమాండ్​ రైతులకు ఉపయోగపడేలా పసుపు బోర్డు పనిచేస్తుందన్నారు. 

కరెంట్​కోతల్లేని దేశాన్ని నిర్మిస్తం: కిషన్​రెడ్డి

కరెంట్​కోతల్లేని నూతన భారత్‌‌‌‌‌‌‌‌ను మోదీ  ప్రభుత్వం నిర్మిస్తున్నదని కేంద్ర మంత్రి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్​రెడ్డి అన్నారు. యూరియా బ్యాగ్​పై రూ.3,500 సబ్సిడీ భరిస్తూ కేవలం రూ.267 రేట్​కు రైతులకు అందిస్తున్నామని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి తెలంగాణ రైతులకు అంకితం చేశామని చెప్పారు.  నిజామాబాద్​ పసుపు రైతుల కోసం ఇప్పుడు బోర్డు ను ఏర్పాటు చేసి గొప్ప కానుక ఇచ్చిందన్నారు.  

రైతు ఆదాయం రెట్టింపు చేయాలె : మంత్రి తుమ్మల 

రాష్ట్రంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు రేవంత్​రెడ్డి  ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా రైతుల సంక్షేమం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.  పసుపు బోర్డు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని తెలిపారు. గిట్టుబాటు ధర​, పసుపు ఎగుమతులు, రీసెర్చ్​, మార్కెటింగ్​ అంశాల్లో రైతులకు లాభం చేకూర్చే నిర్ణయాలు బోర్డు తీసుకోవాలని సూచించారు.