
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. దేశభాషలే మన సంస్కృతికి రత్నాలని చెప్పారు. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా బతకలేమని వ్యాఖ్యానించారు. దేశ భాషలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన 'మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. మన భాషలను గౌరవించుకోవాలి. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడతారు -- అలాంటి సమాజం ఏర్పడే రోజు దగ్గర్లోనే ఉంది . దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే సమాజంలో మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుండా మనం నిజమైన భారతీయులుగా ఉండలేం.
మన దేశాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాష సరిపోదు. విదేశీ భాషల ద్వారా సంపూర్ణ భారతదేశాన్ని అర్థం చేసుకోలేం . భారతీయ భాషలను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటం ఎంత కష్టమైనదో తెలుసు. కానీ ఈ పోరాటంలో తప్పకుండా మనం విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఆత్మగౌరవంతో మనం మన స్వంత భాషల్లోనే దేశాన్ని నడుపుతామని.. మన ప్రపంచాన్ని కూడా నడిపిస్తారని అని అమిత్ షా అన్నారు.