
గాంధీనగర్: డీఎన్ఏ టెస్టులు పూర్తి అయిన తర్వాతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల సంఖ్యపై ప్రకటన చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గురువారం (జూన్ 12) అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి అమిత్ షా హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లారు. విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులతో చర్చించారు.
అనంతరం విమాన ప్రమాదంలో గాయపడి బాధితులు చికిత్స పొందుతోన్న సివిల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల మృతదేహాల వెలికితీత పని పూర్తి అయ్యిందని తెలిపారు. డీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతులను గుర్తించాల్సి ఉందని.. ఇందుకు 1000కి పైగా డీఎన్ఏ టెస్టులు చేయాల్సి ఉందన్నారు.
గుజరాత్లోనే వీలైనంత త్వరగా డీఎన్ఏ టెస్టులు పూర్తి చేస్తామని.. డీఎన్ఏ టెస్టుల తర్వాతే మృతుల సంఖ్యపై ప్రకటన చేస్తామని చెప్పారు. విమానం క్రాష్ అయిన వెంటనే పేలడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం దక్కలేదన్నారు. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిసి పరామర్శించానని తెలిపారు. ప్రధాని మోడీ సహయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
కాగా, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.
ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది చనిపోగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు.