వచ్చే ఏడాది నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా మహీంద్రా..
సీఈవోగా పవన్ కుమార్ గోయెంకా
న్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ మేనేజ్మెంట్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న ఆనంద్ర మహీంద్రా వైదొలుగుతున్నారు. ఆయనను కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమించింది. ఈయన బాధ్యతలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. పవన్ కుమార్ గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్గా మళ్లీ అపాయింట్ చేస్తూ.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. సీఈవో బాధ్యతలను ఆయన వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి చేపడతారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్స్ను అమలు చేయడమే లక్ష్యంగా సీఈవో పొజిషన్ను కంపెనీ క్రియేట్ చేసింది. గోయెంకా పదవీ విరమణ తర్వాత 2021 ఏప్రిల్ 2 నుంచి అనీష్ షా ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది.
మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డులో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా, గ్రూప్ సీఎఫ్ఓగా అనీష్ షా జాయిన్ అవుతారు. ప్రస్తుతం కంపెనీ సీఎఫ్ఓగా వీఎస్ పార్థసారథి ఉన్నారు. పార్థసారథి మహీంద్రా సృష్టించిన కొత్త సెక్టార్ మొబిలిటీ సర్వీసెస్కు హెడ్గా నియమితులవుతారు. మహీంద్రా లాజిస్టిక్స్, ఆటో మొబిలిటీ సర్వీసెస్ తర్వాత కంపెనీ సృష్టించిన కొత్త సెక్టార్ ఇదే. ఆనంద్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్గా 2012 ఆగస్ట్లో నియమితులయ్యారు. 45 ఏళ్ల పాటు కంపెనీని లీడ్ చేసిన తన అంకుల్ కేశుబ్ మహీంద్రా నుంచి ఈ బాధ్యతలు చేపట్టారు. ఈయన పదవీ కాలంలో ఈ గ్రూప్ దేశీయంగా, అంతర్జాతీయంగా ఆటోమొబైల్స్, అగ్రికల్చర్ నుంచి ఐటీ, ఏరోస్పేస్ల వరకు పలు రంగాలకు విస్తరించింది. పలు కొనుగోళ్లను కూడా చేపట్టింది.