14 ఏళ్ల తరువాత విముక్తి.. జైలు నుంచి బయటకు వచ్చిన ఆనంద్ మోహన్

14 ఏళ్ల తరువాత విముక్తి..  జైలు నుంచి బయటకు వచ్చిన  ఆనంద్ మోహన్

ఐఏఎస్ అధికారి హత్య కేసులో గత 15  ఏళ్లుగా జైలు శిక్ష  అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్  ఏప్రిల్ 27 గురువారం ఉదయం సహర్సా జైలు నుంచి రిలీజ్ అయ్యారు.  అతనితో పాటుగా 14 ఏళ్లకు పైగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న 26 మంది ఖైదీలు కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు.  విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషులకు జైలు శిక్షను మినహాయించడాన్ని నిషేధించిన నిబంధనను ఇటీవల బీహార్ ప్రభుత్వం తొలగించింది. 14 ఏళ్ల జైలు శిక్ష లేదా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీల కోసం కొత్త నిబంధనలు ఉన్నాయని రాష్ట్ర న్యాయ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. నితీష్ కుమార్ ప్రభుత్వం  తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది.  

15 ఏళ్లుగా  జైలు శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ మోహన్‌ జైలు నుంచి విడుదల కావడం పట్ల హత్యకు గురైన ఐఎఎస్ అధికారి భార్య ఉమా కృష్ణయ్య అగ్రహాం వ్యక్తం చేశారు. బిహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతోందని అవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని,  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.  ఆనంద్‌మోహన్‌ మళ్లీ జైలుకు పంపాలని కోరారు. ఆనంద్ మోహన్‌  విడుదల విషయంలో బీహార్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కృష్ణయ్య కుమార్తె పద్మ కోరారు.   ఇది తమ కుటుంబానికే కాదని,   యావత్ దేశానికే అన్యాయమని తెలిపారు.  ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని పద్మ వెల్లడించారు.  


ఐఏఎస్ జి కృష్ణయ్య ఎవరు?  హత్య కేసు ఎంటీ?

1994లో లాలూ ప్రసాద్ హయాంలో బిహార్ లో  అండర్‌వరల్డ్ డాన్ చోటాన్ శుక్లాను మరో గ్యాంగ్ స్టర్ మద్దతుదారులు దారుణంగా కాల్చి చంపారు.  1994 డిసెంబర్ 5న చోటాన్ శుక్లా అంత్యక్రియల్లో ఆనంద్ మోహన్‌ పాల్గొన్నారు. అతని పిలుపు మేరకు చాలామంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ టైమ్ లో అటు వైపుగా వెళ్తున్న  గోపాల్‌గంజ్ జిల్లా కలెక్టర్.. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌కు  చెందిన దళిత  ఐఏఎస్ అధికారి  జి కృష్ణయ్యను  కారులోంచి  బయటకు లాగా విచక్షణరహితంగా దాడి చేసి చంపేశారు. 

అయితే ఇదంతా ఆనంద్ మోహన్‌ దగ్గరుండి మరి ప్రేరేపించినట్లుగా చెబుతారు.  2007లో కింది కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దీంతో దేశ చరిత్రలో మరణశిక్ష పడిన తొలి రాజకీయ నాయకుడిగా ఆనంద్ మోహన్‌ రికార్డులకు ఎక్కారు. అతనికి పడ్డ శిక్షను ఆ తర్వాత పాట్నా కోర్టు జీవితఖైదుగా మార్చింది.  తాజాగా తీష్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆనంద్ మోహన్‌ జైలు నుంచి విడుదలయ్యారు.