బిగ్బాస్‌కు పంపిస్తానని మోసం.. యాంకర్ ఫిర్యాదు

బిగ్బాస్‌కు పంపిస్తానని మోసం.. యాంకర్ ఫిర్యాదు

బిగ్ బాస్ సీజన్ 7 లోకి తనను పంపిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ తమిలి రాజు అనే వ్యక్తిపై యాంకర్ అమ్మినేని స్వప్న  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న ... యాంకర్ గా, ఈవెంంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు బిగ్‌బాస్‌ ఇన్‌చార్జి తమిలి రాజుతో పరిచయం ఏర్పడింది.   బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లోకి తనను కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పిన  రాజు  గతేడాది జూన్ లో తన దగ్గర రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడని స్వప్న  వీడియో రిలీజ్ చేసింది.  

ఒకవేళ  బిగ్ బాస్ లో అవకాశం రాకుంటే తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు తనను నమ్మించాడని, అందుకోసం ఒక అగ్రిమెంట్‌ కూడా రాసిచ్చాడని స్వప్న చెబుతుంది.  చివరి టైమ్  వరకు తనను షోలో పంపిస్తానని చెప్పి రాజు మోసం చేశాడంటూ స్వప్న వాపోయింది.  చివరికి మోసం జరిగిందని తెలుసుకుని డబ్బుల గురించి రాజును ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పాడని వీడియోలో చెప్పుకొచ్చింది.  దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్‌ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.