హైదరాబాద్, వెలుగు: ఇటీవల కన్నుమూసిన ప్రజాకవి, జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును సోమవారం శాసనమండలి పాస్ చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందన్నారు.
వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ‘‘అందెశ్రీగా పిలవబడే అందె ఎల్లయ్య సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామంలో జన్మించారు. అనాథ అయిన అందెశ్రీ.. పశువుల కాపరిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని గీత రచయితగా ఎదిగారు. ఎలాంటి సాధికారత విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ, అణగారిన వర్గాలను ప్రతిబింబించేలా 3 వేల కవితలు రచించారు.
తెలంగాణ ప్రజల ఆశలు, పోరాటాలు వాటి స్ఫూర్తిని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర వహించింది. దీనిని తమ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది’’ అని భట్టి అన్నారు. మానవత్వంతో ఈ ప్రభుత్వం అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి ఆయన కొడుకు దత్త సాయిని ఉన్నత విద్యా శాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించినట్టు పేర్కొన్నారు.
