- టిప్ చెల్లిస్తేనే వెహికల్ బుక్ అవుతుందనేలా మెసేజ్లు వద్దు
న్యూఢిల్లీ: వెహికల్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులను టిప్ చెల్లించాలని అడగకూడదని ఓలా, ఉబర్ వంటి క్యాబ్ ప్రొవైడర్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రైడ్ ప్రారంభానికి ముందే టిప్ చెల్లింపునకు సంబంధించిన ఆప్షన్ కనిపించకూడదని ఆర్డర్స్ ఇచ్చింది. అదనంగా టిప్ లేదా డబ్బులు చెల్లిస్తే క్యాబ్ త్వరగా దొరుకుతుందని, డ్రైవర్ రైడ్ను తొందరగా యాక్సెప్ట్ చేస్తాడని, బుకింగ్ వెంటనే కన్ఫర్మ్ అవుతుందనే భావన.. ప్రయాణికుల్లో కలిగించేలా యాప్లలో ఎలాంటి ఆప్షన్లు, మెసేజ్లు ఉండొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్లకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. రైడ్ పూర్తయ్యాక ప్రయాణికులు తమ ఇష్టప్రకారం డ్రైవర్కు టిప్ ఇవ్వొచ్చని పేర్కొంది. కాబట్టి, ఈ ఆప్షన్ను ప్రయాణం ముగిసిన తర్వాతే యాప్లలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఆ టిప్ మొత్తం డ్రైవర్కు మాత్రమే అందాలని, అందులో ఏ కొంతమొత్తం కూడా అగ్రిగేటర్కు లేదా కంపెనీకి చేరొద్దని చెప్పింది.
టిప్ ఇస్తే క్యాబ్ త్వరగా వస్తుందని చెప్పొద్దు..
బుకింగ్ సమయంలో కొన్ని రైడ్ -హెయిలింగ్ యాప్లలో అడ్వాన్స్ టిప్, చూజ్.. యాడ్-ఆన్, త్వరగా రైడ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను పెంచుకోండి.. వంటి మెసేజ్లు కనిపిస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో టిప్ చెల్లిస్తే డ్రైవర్ తమ రైడ్ను త్వరగా అంగీకరిస్తారనే అభిప్రాయం ప్రయాణికులకు కలిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణికులను మభ్యపెట్టేలా, డబ్బులు అదనంగా చెల్లించేలా ప్రోత్సహించే ఎలాంటి నోటిఫికేషన్లు, మెసేజ్లు, ఆప్షన్లు.. వెహికల్ బుకింగ్ యాప్లలో కనిపించొద్దని కేంద్రం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ముందస్తు టిప్ విధానాన్ని నిలిపివేయాలంటూ గతంలో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ కూడా ఆదేశించింది. తాజాగా రోడ్డు రవాణా శాఖ ఆదేశాలతో ఈ నిబంధన మరింత స్పష్టమైంది.
