రోడ్డు ప్రమాదంలో.. ఏపీ హైకోర్టు జడ్జికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో..  ఏపీ హైకోర్టు జడ్జికి తీవ్రగాయాలు

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్​కు వస్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో ఆదివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. జస్టిస్ సుజాతను ముందుగా ఫస్ట్ ఎయిడ్ కోసం పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదేసమయంలో తిరుమలగిరిలో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి విషయం తెలుసుకుని హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. 

మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని డాక్టర్లు చెప్పారు. దీంతో వెంటనే మూడు జిల్లాల ఎస్పీలను మంత్రి అలర్ట్ చేశారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు హైవేపై ట్రాఫిక్ ను స్థానిక పోలీసులు క్లియర్ చేసేలా చర్యలు తీసుకున్నారు. వర్షం కురుస్తుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా మంత్రి కాన్వాయ్ ను పంపారు. న్యాయమూర్తి సుజాతను తరలించే అంబులెన్స్ ను కాన్వాయ్ మధ్యలో ఉంచి రక్షణగా హైదరాబాద్ కు తరలించారు. జస్టిస్ సుజాత ప్రస్తుతం సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.