
ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ‘రాజధాని ఫైల్స్’ చిత్రం తెరకెక్కించాను అన్నారు దర్శకుడు భాను. కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ ‘ఇది పొలిటికల్ సినిమా కాదు.. దీన్ని ఏ పార్టీ జెండా కోసమో తీయలేదు.. జనం కోసం తీశా. ప్రజల ఆవేదనను చూపించా. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని నమ్మి తమ భూములు ఇచ్చారు. మరో ప్రభుత్వం వచ్చి వారిపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టింది. జనం నమ్మింది ప్రభుత్వాన్నే కానీ పార్టీలను కాదు. దీన్నే సినిమాగా తెరకెక్కించా. రైతులు పడిన ఇబ్బందులు, మానసిక సంఘర్షణ, వారిని ఇబ్బంది పెట్టే మనుషులు, న్యాయం కోసం రైతులు చేసిన పోరాటం ఇందులో చూపించాం తప్ప రాజకీయ అంశాలు కాదు. రాజధాని సమస్యకు పరిష్కారం కూడా చూపించాం. రైతుల ప్రతినిధిగా వినోద్ కుమార్ గారు, ఆయన భార్యగా వాణీ విశ్వనాథ్ కనిపిస్తారు. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడే ప్రజల సినిమా ఇది’ అన్నారు.