మా సమస్యలు పరిష్కరించండి.. ఎన్నికల టైమ్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి : అంగన్వాడీ కార్యకర్తలు

మా సమస్యలు పరిష్కరించండి.. ఎన్నికల టైమ్లో ఇచ్చిన  హామీలు అమలు చేయండి : అంగన్వాడీ కార్యకర్తలు

 

  •     అంగన్​వాడీ కార్యకర్తల డిమాండ్​
  •     చలో సెక్రటేరియెట్​తో నిరసన.. పలువురు అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్​వాడీలు గురువారం చేపట్టిన ‘చలో సెక్రటేరియెట్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ హెల్పర్స్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో దోమలగూడ ఏవీ కాలేజీ వద్ద నుంచి అంగన్​వాడీలు ఇందిరా పార్క్‌ వద్దకు చేరుకున్నారు.

 అక్కడ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత అక్కడి నుంచి సెక్రటేరియెట్ ముట్టడించేందుకు ట్యాంక్‌ బండ్‌ వద్దకు చేరుకోగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్​వాడీ, సీఐటీయూల మధ్య తోపులాట జరిగింది. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి స్పృహ తప్పిపడిపోయారు. 

పలువురు సీఐటీయూ నేతలు, అంగన్​వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, దోమలగూడ, ఉస్మాన్‌గంజ్‌ తదితర పోలీస్‌ స్టేషన్స్‌ కు తరలించారు. కొందరు తప్పించుకుని సెక్రటేరియెట్ గేటు ముందుకు చేరుకుని ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.