పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 523వ వర్ధంతి మహోత్సవాన్ని మార్చి 15న తిరుమలలో టీటీడీఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపు, నారాయణగిరి ఉద్యానవనాల్లో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి
ఆ రోజున శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. ఆ తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తారు.
