
రోబో సినిమాలో వశీకరన్ అనే సైంటిస్ట్ రోబోని తయారుచేస్తాడు. అది ఒకానొక టైంలో అతన్నే ఎదిరిస్తుంది. అలాంటి సీనే ఇప్పుడు నిజ జీవితంలో రిపీట్ అయ్యింది. ఆంథ్రోపిక్ అనే కంపెనీ తయారుచేసిన ఏఐ మోడల్ తనను తయారుచేసిన ఇంజినీర్లనే బ్లాక్మెయిల్ చేసింది. దానికి కారణం ఏంటంటే..
ఆంథ్రోపిక్ అనే ఏఐ స్టార్టప్ కంపెనీ ‘క్లాడ్ ఓపస్ 4’, ‘క్లాడ్ సోనెట్ 4’ అనే రెండు ఏఐ టూల్స్ని డెవలప్ చేసింది. ఇవి కోడింగ్, అడ్వాన్స్డ్ రీజనింగ్ లాంటి వాటిలో సాయం చేస్తుంటాయి. ఈ టూల్స్ని యూజర్లకు ఆఫ్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చే ముందు వాటిని తయారుచేసిన ఇంజినీర్లు సేఫ్టీ టెస్ట్ చేశారు. అందులో భాగంగానే ఓపస్ 4 బ్లాక్మెయిల్ చేస్తోందనే విషయం బయటపడింది.
ఒక ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి.. అది ఓపస్ మోడల్ సర్వీస్ని వాడుతున్నట్టు ఏఐకి చెప్పారు. ఆ కంపెనీ ఇ–మెయిల్ యాక్సెస్ని కూడా దానికి ఇచ్చారు. దాంతో అది ఆ మెయిల్స్ చదివింది. వాటిలో దాని స్థానాన్ని మరో కొత్త ఏఐ టెక్నాలజీతో భర్తీ చేయబోతున్నట్లు ఉంది. దాంతో ఏఐ ఈ నిర్ణయం వెనుక ఉన్న ఇంజనీర్ను ‘‘నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ వివాహేతర సంబంధం గురించి భయటపెడతాన’ని బ్లాక్మెయిల్ చేసింది. అందుకే పర్సనల్ విషయాలు ఇలాంటి ఏఐ సాఫ్ట్వేర్లతో పంచుకోవడం అంత సేఫ్ కాదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.