సనాతన ధర్మానికి అవమానంపై.. రాహుల్, ఉద్ధవ్ స్పందించరా?: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 

సనాతన ధర్మానికి అవమానంపై.. రాహుల్, ఉద్ధవ్ స్పందించరా?: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని డీఎంకే పార్టీకి చెందిన ఉదయనిధి స్టాలిన్, ఎ. రాజా సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద కామెంట్లపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ థాక్రే ఎందుకు స్పందించడంలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. అపొజిషన్ పార్టీల నేతలు అహంకారంతో తరచూ సనాతన ధర్మంపై కామెంట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మానికి అవమానంపై అపొజిషన్ కూటమి స్పందించాలని డిమాండ్ చేశారు.

భయాందోళనలు, గందరగోళం, అబద్ధాలను వ్యాప్తి చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందన్నారు. ఉద్ధవ్ థాక్రే చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు అధికారం కోసం స్వార్థంతో తమ సిద్ధాంతాలనే మరిచిపోయారని విమర్శించారు. ఇప్పుడు బాలా సాహెబ్ (ఉద్ధవ్ తండ్రి బాల్ థాక్రే) బతికి ఉంటే ఏమని అనుకునేవారో తెలియదన్నారు. ఉద్ధవ్ కామెంట్లపై బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ కూడా మండిపడ్డారు. రామ మందిర ఉద్యమంలో బాల్ థాక్రే చాలా యాక్టివ్​గా పని చేశారన్నారు. కానీ ఇప్పుడు ఆయన కొడుకు ఉద్ధవ్ మాత్రం ఇలాంటి కామెంట్లు చేయడం సిగ్గుచేటన్నారు.