
హైదరాబాద్, వెలుగు: పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ, నిర్మాణ బాధ్యతలను చూసేందుకు ఏపీ జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసిన పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు ఆ కార్పొరేషన్కు ఆఫీస్ సెటప్నూ ఏర్పాటు చేసింది. విజయవాడలోని గవర్నరుపేటలో ఉన్న ఇరిగేషన్ కాంపౌండ్లో కార్పొరేషన్ ఆఫీసును ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఏపీ స్పెషల్ చీఫ్సెక్రటరీ జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాకుండా ఇకపై అధికారిక సమాచార మార్పిడి కోసం jalaharaticorporation@gmail.com పేరిట ఈ మెయిల్ ఐడీని క్రియేట్ చేసింది.
ఏప్రిల్ 8న కార్పొరేషన్ ఏర్పాటు
బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఐదుగురిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమించింది. కార్పొరేషన్కు చైర్మన్గా సీఎం చంద్రబాబు వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఉండనున్నారు. ఎండీ, సీఈవోగా ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్, డైరెక్టర్లుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్సీలు వ్యవహరించనున్నారు. 8 మందికి షేర్లు ఇచ్చింది.
ఒక సీఈ, ఇద్దరు ఎస్ఈలు, ముగ్గురు ఈఈలు, 10 మంది డీఈఈ/ఏఈఈలు, ముగ్గురు అకౌంట్స్ ఆఫీసర్ (చార్టర్డ్ అకౌంటెంట్స్), ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ను ఏపీ సర్కారు నియమించింది. అయితే, ఆ తర్వాత గత నెల 12న బోర్డు డైరెక్టర్లలో మార్పులు చేసింది. చైర్మన్గా ఏపీ సీఎం చంద్రబాబు కాకుండా.. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని చైర్మన్, ఎండీగా నియమించింది. డైరెక్టర్లుగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్సీ, ఇద్దరు నామినీలను నియమించనున్నట్టు మే 12న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆ తర్వాత రెండు రోజులకు అంటే మే 14న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పేర్లను ఖరారు చేసింది. చైర్మన్, ఎండీగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, డైరెక్టర్లుగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్కుమార్, ఈఎన్సీ నరసింహ మూర్తి, ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లుగా బానోతు రాంబాబు, మామిడి వెంకటేశ్వర రావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.