పదేళ్లలో ఏపీని మాజీ సీఎం చంద్రబాబు, సీఎం జగన్ అప్పుల ఊబిలో నెట్టేశారని విమర్శించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇవాళ ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల ..ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు షర్మిల. జగన్ 3 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఏపీపై 10 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. భూతద్దంలో చూసినా ఏపీ అభివృద్ధి కనపించడం లేదని విమర్శించారు.
ఏపీ పాలకులు పదేళ్లయినా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు..పిల్లలకు ఉద్యోగాలు రాలేదన్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు టైంకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఏక్కడ చూసినా.. దోచుకోవడం దాచుకోవడమేనని ఆరోపించారు. ఎక్కడ చూసినా లిక్కర్, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు.
అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ధ్వజమెత్తారు షర్మిల. వైసీపీ మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా కట్టలేదని మండిపడ్డారు. రాజధాని కట్టడానికి డబ్బులు కూడా లేవన్నారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు. ఏపీకి కంపెనీలు వస్తే..యువతకు ఉద్యోగాలొచ్చేవని చెప్పారు. ఏపీలో బీజేపీ ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీతో టీడీపీ, వైసీపీ దోస్తీ ఎందుకని ప్రశ్నించారు.
బీజేపీతో దోస్తీ కోసం వైసీపీ,టీడీపీ పోలవరాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు షర్మిల. బీజేపీకి అమ్ముడుపోయేందుకు ఇన్ని జెండాలు ఎందుకు.. టీడీపీ ,వైసీపీ కూడా బీజేపీ జెండా పెట్టుకుంటే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. టీడీపీ,వైసీపీలకు ఓటేసినా బీజేపికి వేసినట్టేనని చెప్పారు. బీజేపీకి మతాలను రెచ్చగొట్టి మంట పెట్టుకోవడం..ఆ మంట కింద చలి కాచుకోవడమే తెలుసన్నారు. వైఎస్సార్ బీజేపీకి ముమ్మాటి వ్యతిరేకని చెప్పారు. వైఎస్సార్ బిడ్డతో చేతులు కలపాలని ప్రజలను కోరారు. వైఎస్సార్ ఆశయాలను నిజం చేస్తామని చెప్పారు.