హైదరాబాద్, వెలుగు: కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ చారిత్రక రక్షణల కింద నీటి కేటాయింపులు చేసిందని, వాటిని మార్చలేరని ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదించింది. పంట మార్పిడి, అదనపు ప్రత్యామ్నాయ నీటి వనరుల ద్వారా కృష్ణా జలాల్లో మిగులు ఏర్పడుతుందని తెలంగాణ చేస్తున్న వాదనల్లో నిజం లేదని పేర్కొంది. శుక్రవారం మూడో రోజూ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలను కొనసాగించింది. తెలంగాణ లెక్కలు తప్పని కొట్టిపడేసింది. కృష్ణా డెల్టాకు చారిత్రక రక్షణల కింద 181.2 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించిందని గుర్తుచేసింది.
డెల్టా కాల్వల ఆధునీకరణ ఫలితంగా నీటి వినియోగం 152.2 టీఎంసీలకే తగ్గిందని, తద్వారా మిగిలిన జలాలను పులిచింతల, రాజీవ్ భీమా లిఫ్ట్లకు ఉమ్మడి ఏపీ కేటాయించిందని, దానిని సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) ఆమోదించిందని వివరించింది. కానీ ప్రత్యామ్నాయ పంటలు, నీటి వనరుల అంచనా ప్రకారం తెలంగాణ డెల్టా కేటాయింపులను 130.1 టీఎంసీలకు తగ్గించడం కరెక్ట్ కాదని పేర్కొంది. పంటకాలం 150 రోజులుగా కాకుండా, కేవలం 122 రోజులుగా మాత్రమే లెక్కగట్టిందని వివరించింది. తదుపరి విచారణను వచ్చే నెల 23, 24, 25 తేదీలకు ట్రిబ్యునల్ వాయిదా వేసింది.
