
గ్లామర్ రోల్స్ను పక్కనబెట్టి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది అనుష్క. అయితే ‘నిశ్శబ్దం’ సినిమా వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు తిరిగి ప్రేక్షకులకు కనిపించలేదామె. ప్యాండమిక్తో పాటు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంది. పోయినేడు అనుష్క బర్త్ డే సందర్భంగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమాని అనౌన్స్ చేసింది. ఇందులో నవీన్ పొలిశెట్టి మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి.మహేష్ దర్శకుడు. కానీ ఆ తర్వాత టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో సినిమా ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే రీసెంట్గా నవీన్ పొలిశెట్టి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్తో ఈ సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సెట్స్లో అడుగుపెట్టిన అనుష్క, ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటోంది. అనుష్క ఫస్ట్ మూవీ ‘సూపర్’ విడుదలై పదిహేడేళ్లు పూర్తయిన సందర్భంగా షూటింగ్ లొకేషన్లో కేక్ కట్ చేసి స్పెషల్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ‘ఈ పదిహేడేళ్లలో నేనే అనుష్కకి బెస్ట్ కో స్టార్ అంట, అద్భుతమైన తన ఇన్నేళ్ల జర్నీకి కంగ్రాట్స్. మా సినిమా షూటింగ్ జరుగుతోంది’ అంటూ ‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అని రాసి ఉన్న కేక్ ఫొటోని పోస్ట్ చేశాడు నవీన్. దీంతో ఈ మూవీ ఆగిపోలేదనే విషయం తేలిపోయింది. అనుష్కకి ఇది నలభై ఎనిమిదో చిత్రం. ఇది పూర్తవకముందే ఆమె మరో మూవీకి కూడా ఓకే చెప్పిందట. తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘నాన్న’ చిత్రానికి పని చేశారు.