హైదరాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ప్రిలిమ్స్ పరీక్ష కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రాజేంద్రనగర్లోని ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్ ఇస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ వెల్లడించారు. 'శ్రీరామ్స్ ఐఏఎస్' కోచింగ్ సంస్థ భాగస్వామ్యంతో ఈ శిక్షణ అందించనున్నట్లు శుక్రవారం తెలిపారు.
అర్హులైన అభ్యర్థులను ఆబ్జెక్టివ్, ఆప్టిట్యూడ్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు. ఆసక్తి ఉన్నవారు (welfare.sriramsias.com) వెబ్సైట్లో ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కోచింగ్, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో లభిస్తాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9121087421 లేదా 6281766534 నంబర్లను సంప్రదించాలని డైరెక్టర్ పేర్కొన్నారు.
