ఆన్​లైన్​లో ఆగస్టు 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ

ఆన్​లైన్​లో ఆగస్టు 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌‌ కోర్సుల్లో అడ్మిషన్స్​ కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌‌ ఆప్టిట్యూడ్‌‌ టెస్ట్‌‌ ఇన్‌‌ ఇంజినీరింగ్‌‌ (గేట్‌‌)-–2023 నోటిఫికేషన్‌‌ విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో ఉన్నత విద్య చదవడంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్‌‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌‌ డిగ్రీ, పీహెచ్‌‌డీ కోర్సులు చేయడానికి గేట్‌‌ స్కోర్‌‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది గేట్‌‌ పరీక్షను ఐఐటీ కాన్పూర్‌‌ నిర్వహిస్తోంది.

అర్హతలు: ఇంజినీరింగ్‌‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌‌, సైన్స్‌‌, కామర్స్‌‌, ఆర్ట్స్‌‌లో బ్యాచిలర్‌‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: అభ్యర్థులను కంప్యూటర్‌‌ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. 29 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్‌‌ ఛాయిస్‌‌ ప్రశ్నలు, మల్టిపుల్‌‌ సెలెక్ట్‌‌ ప్రశ్నలు, న్యూమరికల్‌‌ ఆన్సర్‌‌ టైప్‌‌ ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌‌ మార్కింగ్‌‌ ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్​ 30 వరకు అప్లై చేసుకోవాలి. జనరల్​ అభ్యర్థులకు రూ.1700, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.850 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 

ఎగ్జామ్​: పరీక్షలు 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలు 16 మార్చి 2023న విడుదల చేస్తారు. పూర్తి సమాచారం కోసం వెబ్​సైట్ www.gate.iitk.ac.in సంప్రదించాలి.