కూకట్​పల్లిలో నిండు చులాలుకు హీట్​ ప్యాడ్స్ కడితే.. బొబ్బలు వచ్చి చర్మం ఊడొచ్చింది

కూకట్​పల్లిలో నిండు చులాలుకు హీట్​ ప్యాడ్స్ కడితే.. బొబ్బలు వచ్చి చర్మం ఊడొచ్చింది
  • అంకుర్​ హాస్పిటల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
  • ఈ నెల 24న ఘటన మరవకముందే మరొకటి

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని అంకుర్ హాస్పిటల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ నెల 24న డెలివరీ కోసం హాస్పిటల్​కు వచ్చిన నిండు గర్భిణి అరగంట వ్యవధిలోనే చనిపోగా, తాజాగా మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై తీవ్ర అవస్థలు పడింది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన సంధ్య(26) ఈ నెల 22న అంకుర్​హాస్పిటల్లో డెలివరీ కోసం చేరింది. 

అదే రోజు ఆమెకు డాక్టర్లు​సిజేరియన్​చేస్తే ట్విన్స్​పుట్టారు. ఆ తర్వాత సంధ్యను ఐసీయూకు షిఫ్ట్​చేశారు. శుక్రవారం చలి ఎక్కువగా ఉందని చెప్పడంతో సిబ్బంది ఆమె రెండు కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. ఆ తర్వాత ఈ విషయం మర్చిపోయారు. అరగంట తర్వాత బాధితురాలికి మత్తు వదిలి తీవ్ర నొప్పితో కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తొలగించారు. అప్పటికే సంధ్య రెండు కాళ్లకు బొబ్బలు ఏర్పడి, చర్మం ఊడిపోయింది. ప్రస్తుతం ఆమెకు అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.